యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ప్రెండిషిప్ డే సందర్భంగా ఈ రోజు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి దోస్తీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. స్వరవాణి కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటను తెలుగులో హేమచంద్ర ఆలపించారు.
“పులికి విలుకాడుకి.. తలకి ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి.. కసిరే వడగళ్లకి.. రవికీ మేఘానికీ.. దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో” అంటూ సాగే ఈ పాట ఇద్దరు భిన్నమైన మనస్కుల మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేసేలా సాగింది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఇదే పాటను తమిళంలో అనిరుధ్, హిందీలో అమిత్ త్రివేది, మలయాళంలో విజయ్ యేసుదాస్, కన్నడంలో యాజిన్ నజీర్ పాడారు. ఈ పాటలో కీరవాణితో పాటు ఐదు భాషల్లో పాటను పాడిన సింగర్స్ తోపాటు చివరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తేజ కూడా కనిపించడం విశేషం. ఈ పాట విన్న వెంటనే ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ను చూస్తామా అనే ఆసక్తిని పెంచుతోంది.