Thursday, March 12, 2026
HomeTrending NewsJaipur: వేకువ జామునే జైపూర్ లో వరుస భూకంపాలు

Jaipur: వేకువ జామునే జైపూర్ లో వరుస భూకంపాలు

రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరాన్ని వరుస భూకంపాలు కుదిపేశాయి. ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మూడు భూకంపాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి. మొదటి భూకంపం ఉదయం 04:09 గంటలకు సంభవించగా.. రిక్టరు స్కేలుపై దాని తీవ్రత 4.4 గా నమోదైంది. ఆ తర్వాత 4:22 గంటల ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రెండో సారి రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. ఆ వెంటనే మూడు నిమిషాలకే అంటే 4:25కి మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. మూడోసారి రిక్టరు స్కేలుపై 3.4 తీవ్రతగా నమోదైంది.

వరుస భూకంపాలతో గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టంపై ప్రస్తుతం స్పష్టత లేదు. భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలను ప్రజలు సోషల్​ మీడియాలో షేర్​ చేశారు.

మరోవైపు ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్ లో కూడా ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉక్రుల్​ ప్రాంతంలో 5:01 గంటలకు 3.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular