Tuesday, September 17, 2024
HomeTrending NewsParliament: మణిపూర్ పై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాల డిమాండ్

Parliament: మణిపూర్ పై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాల డిమాండ్

మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక పరిస్థితులపై లోక్ సభలో విపక్షాలు చర్చకు పట్టాయి. సభ ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశం చర్చకు చేపట్టాలని స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. విపక్షాలను సముదాయించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రయత్నించినా విపక్ష పార్టీల ఎంపీలు శాంతించ లేదు. హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారన్నా వినలేదు. ప్రధానమంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో స్పీకర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.

రాజ్యసభలో విపక్ష పార్టీలు వివిధ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టగా చైర్మన్ తిరస్కరించారు. మణిపూర్ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్ ఎస్ పక్ష నేత కే కేశవరావు చైర్మన్ తో వాగ్వాదానికి దిగారు. మణిపూర్ అంశం సుప్రీం కోర్టులో ఉన్నందున చర్చకు అవకాశం లేదని చైర్మన్ చెప్పటంతో కేశవరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశవరావు కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపి మనోజ్ తివారి, టిఎంసి ఎంపి డెరెక్ ఓబ్రేయిన్ మణిపూర్ అంశం చర్చకు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో సభలో గందరగోళం నేలకొనటంతో చైర్మన్ జగదీప్ ధన్క్హాడ్ సభను మధ్యాహ్నం 2.30 వరకు వాయిదా వేశారు.

మణిపూర్ అంశంపై ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. మణిపూర్‌లో గిరిజన మహిళలపై అనాగరిక చర్యలు, ఆ రాష్ట్రంలోని పరిస్థితులపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్‌ చేసింది. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌ షా మౌనంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో కేకే వాయిదా తీర్మానం నోటీసులు అందజేశారు.

రాజ్యసభ అన్ని కార్యక్రమాలను వాయిదా వేసి 267 నిబంధన కింద మణిపూర్‌ అంశంపై చర్చ చేపట్టాలని కేకే డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో శాంతి నెలకొనడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడాలని ఆకాంక్షించారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మణిపూర్‌లో శాంతి నెలకొనాలని.. సాధారణ పరిస్థితులు ఏర్పడాలని బీఆర్ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్