Saturday, September 21, 2024
HomeTrending NewsToll free1967: తరుగు తీస్తే కఠిన చర్యలు - పౌరసరఫరాల కమిషనర్‌

Toll free1967: తరుగు తీస్తే కఠిన చర్యలు – పౌరసరఫరాల కమిషనర్‌

కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు వచ్చిన తరువాత తాలు పేరుతో తరుగు తీయకూడదని, తేమ తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులుకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ తెలిపారు.  తాలు తరుగుపై పత్రికల్లో వస్తున్న వార్తలపై విచారణ జరిపి వాస్తవ పరిస్థితులను నివేదించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో ధాన్యం దించుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం దిగుమతికి మిల్లర్లు ఇబ్బంది పెట్టకుండా తక్షణం దించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
రైతులు ఒకేసారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా ఒక క్రమ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం (తేమ శాతం 17 లోపు) ఉండే విధంగా ఆరబెట్టి తాలు లేకుండా తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి వేచిచూసే పరిస్థితి లేకుండా కొనుగోలు జరపాలని ఆదేశించారు.
లారీలు హామాలీల కొరత లేకుండా కొనుగోలు ప్రక్రియ సాపీగా సాగేలా ధాన్యం కొనుగోలుకు సంబంధం ఉన్న వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, సహకార తదితర విభాగాలతో క్షేత్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
తాలు తరుగు పేరుతో మిల్లర్లు నుంచి ఎదురవుతున్న సమస్యలతో పాటు ధాన్యం కొనుగోలు, ధాన్యం రవాణా, కనీస మద్ధతు ధర తదితర ఫిర్యాదుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్‌లోని ఫౌరసరఫరాల భవన్‌లో 1967, 180042500333 టోల్‌ ఫ్రీ నంబర్‌లను ఏర్పాటు చేయడం జరిగింది.
గౌరవ మంత్రివర్యులు కమలాకర్‌గారి ఆదేశాల ప్రకారం ధాన్యం అమ్ముకునేందుకు రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుకుగా సాగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి 16.66 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ ఏడాది ఇప్పటివరకు 25.35 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. 8.69 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసాం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి 3.34 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్‌ మిల్లులకు కేటాయించడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్