వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయించనని, ప్రజలు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు. సోమవారం రాజస్థాన్లోని ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయించొద్దని నిర్ణయించుకున్నాను. ఎవరికీ ఛాయ్ తాగించడం వంటివి కూడా చేయను. ఓటు వేయాలనుకునే వారు వేస్తారు. వేయొద్దనుకునే వారు వేయరు. చేసిన సేవ, అభివృద్ధి, పేదల సంక్షేమం, ఆరోగ్య వసతులు కల్పించడం, యువతకు ఉపాధి, పిల్లలకు మంచి విద్యను అందించడం ద్వారానే ఓట్లు వస్తాయి’ అని నితిన్ గడ్కరి పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నితిన్ గడ్కరీ. వరుసగా రెండు దఫాలు ఆయన అక్కడినుంచే గెలుపొందారు. గతంలో తనకు విజయం కష్టమని చాలామంది చెప్పారని, పట్టుదలతో పోటీ చేసి గెలిచానన్నారు. వచ్చే దఫా మెజార్టీ మరింత పెంచుకుంటానన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం తన పేరుతో ఒక్క పోస్టర్ కానీ, బ్యానర్ కానీ నియోజకవర్గంలో కనిపించదని అంటున్నారు గడ్కరీ. తనకు ఓటు వేయాలనుకున్న వాళ్లు వేస్తారని, ఇష్టం లేనివాళ్లు వేయరని చెప్పారు. సేవా రాజకీయాలు, అభివృద్ధి రాజకీయాలు, ప్రజలకు చేసిన మంచి ద్వారా మాత్రమే ఓట్లు లభిస్తాయంటున్నారు గడ్కరీ. అంతే కానీ పోస్టర్లు, బ్యానర్లతో ఓట్లు రావని చెప్పారు.