Allu Arjun Wish Varudu Kavalenu Team A Very Big Success :
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది.
ఈ వేడుకలోముఖ్య అతిథిగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “కరోనా వల్ల సినిమా ఇండస్ర్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా రిలీజ్ సీజన్ ఇండస్ర్టీకి చాలా ముఖ్యం. థియేటర్లు తెరచుకున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తున్నారు. ఇదే పాజిటివిటీతో ముందుకెళ్లాలి.
తెలుగులో ‘వరుడు కావలెను’, తమిళంలో ‘అన్నాత్తే’, కన్నడలో ‘భజరంగి 2’, హిందీలో ‘సూర్య వన్షీ’.. సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అన్నీ మంచి విజయం సాధించాలి. అలాగే డిసెంబర్ 17న ‘పుష్ప’తో మేం కూడా వస్తున్నాం. మా సినిమా కూడా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా. ఈ దీపావళికి భారతీయ సినిమా గతంలోలాగా ప్రేక్షకులను అలరించి మంచి బిజినెస్ చేస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
“ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ‘దిగు దిగు నాగ’ పాట మా ఇంట్లో మోగుతూనే ఉంటుంది. నాగశౌర్య సినిమాలన్నీ చూశా.. అతను చాలా అందగాడు. మనసున్న వ్యక్తి. భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడు. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయం కృషితో ఎదిగేవారంటే నాకు చాలా ఇష్టం.. శౌర్య తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకున్నారు. ‘పెళ్లి చూపులు’ చూసి రీతూ వర్మ గురించి తెలుసుకున్నా. అమ్మాయిల్లో నాకు హుందాతనం అంటే ఇష్టం.. అది రీతూ దగ్గర చాలా ఉంది. ముంబయ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అన్ని విభాగాల్లో మహిళలు ఎక్కువ శాతం కనిపిస్తారు. మన దగ్గర ఇలా ఎప్పుడు చూస్తామా అనుకునేవాణ్ణి. తెలుగులో హీరోయిన్లుగా మాత్రమే వస్తున్నారు. అన్ని శాఖల్లోకి మహిళలులు రావాలి. ఆ రోజులు త్వరలో వస్తాయనుకుంటున్నా. దర్శకురాలిగా పరిచయం అవుతున్న లక్ష్మీ సౌజన్యకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి విశాల్, తమన్ మంచి సంగీతం అందించారు. ఇద్దరు సంగీత దర్శకులు కలిసి పని చేయడానికి ఇగో అడ్డు వస్తుంది. అలాంటివేమీ లేకుండా వీరిద్దరూ మంచి అవుట్పుట్ ఇచ్చారు. గీతా ఆర్ట్స్ తర్వాత నేను సొంత సంస్థగా భావించే బ్యానర్ ఇది. ‘జెర్సీ’కి జాతీయ అవార్డు అందుకున్నందుకు నాగవంశీకి థ్యాంక్స్” అన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “ఈ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఇందులో కొన్నిపాత్రలు మనతో పాటు ఇంటికి వస్తాయి. మన ఇళ్లల్లో జరిగే ఆడపిల్లల తాలూకు కథ ఇది. మనసుకు దగ్గరగా ఉంటుంది. శౌర్య బాగా యాక్ట్ చేశాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోతుంది. రీతూ పెళ్లి కథాంశం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత సినిమా మొత్తం చీరకట్టులో ఓ హీరోయిన్ని చూశాను. చినబాబు గారి మనసుకి దగ్గరైన సినిమా ఇది. కరోనా వల్ల ఏడాది కాలం వేచి చూశారు” అన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ “ఏడాదిన్నర నిరీక్షణకు మంచి దారి దొరికింది. సినిమా పక్కా హిట్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. మా అందరికీ ఉన్ననమ్మకం. 29న మా అక్క సౌజన్య లైఫ్ డిసైడ్ కాబోతుంది. తను దర్శకురాలిగా సెట్ అయిపోయినట్లే. తను అనుకున్నది అనుకున్నట్లు తీసింది. డెఫినెట్గా తను అనుకున్న జీవితాన్ని పొందుతుంది. మా అక్క సక్సెస్కి మేమంతా ఉన్నాం. మురళీశర్మ గారి క్యారెక్టర్ నన్ను కదిలించింది. చినబాబు గారి సహనానికి గ్రేట్. తగ్గేదేలే అన్నట్లు బడ్జెట్ పెట్టారు. బన్నీ అన్న నాకు స్ఫూర్తి “ అన్నారు.
దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ “మనిషికీ, మాటకు విలువిచ్చే వ్యక్తి చినబాబు గారు. నాకు కెరీర్ని ఇచ్చారు. నా కలను నిజం చేశారు. ఆయన ఓపికకు మెచ్చుకోవాలి. శౌర్యతో మళ్లీ సినిమా చేయాలనుంది. నదియా గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. నా కథకు గణేశ్ మంచిమాటలు ఇచ్చారు. మంచి టీమ్ కుదరబట్టే నేనీ సినిమా చేయగలిగాను” అన్నారు.
Must Read : ‘వరుడు కావలెను’ పెళ్ళి వేడుక పాట విడుదల