రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదివారం ఉండి ఎన్ ఆర్ సి అగ్రహారంలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఎన్ఆర్ సి అగ్రహారంలోని విశ్వేశ్వర స్వామివార్లను సతీమణితో కలిసి రఘుపతి దర్శించుకున్నారు. అనంతరం ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, ఉమ్మడి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను కోన రఘుపతి ఆవిష్కరించారు.

అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ పాఠశాలకు ఎంతో చరిత్ర ఉందని కోన రఘుపతి అన్నారు. గతంలో ఉండి గ్రామంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత తాడికొండ సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్పెషల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఒకటే ఉండేదని అప్పట్లో అనేక మంది ఈ పాఠశాల నుండి విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం ఉన్నత పదవులలో ఉన్నారన్నారు. ఆయన స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయనను చిరకాలం గుర్తుంచుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ అన్నారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే మంతెన రామ రాజు తో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *