Tuesday, March 19, 2024
HomeTrending Newsనివేదిక రాగానే కఠిన చర్యలు: హోం మంత్రి

నివేదిక రాగానే కఠిన చర్యలు: హోం మంత్రి

మహిళా భద్రతకు, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. దిశా యాప్ ద్వారా ఇప్పటివరకు 900 పైగా మహిళలను ఆపద నుంచి రక్షించామన్నారు.  గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఫోరెన్సిక్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని, ఇదే విషయాన్ని ప్రభుత్వం తరఫు నుంచి స్పష్టంగా చెప్పినా రాద్దాంతం చేయడం తగదన్నారు. టిడిపి మహిళా నేతలు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని వనిత మండిపడ్డారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు, వారి సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే దాని నుంచి దృష్టి మళ్ళించడానికి, ఈ ఘటన ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అది తన వీడియో కాదని ఆ ఎంపీ చెప్పారని, దీనిపై విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే తప్పు తేలితే తప్పకుండా చర్యలుంటాయన్నారు. మా పార్టీ ఎంపీ అయినా తప్పు చేసినట్లు తేలితే ఏమాత్రం ఉపేక్షించబోమని, సిఎం జగన్ కఠిన చర్యలు తీసుకుంటారని హోం మంత్రి స్పష్టం చేశారు.

తెలుగుదేశం హయాంలో వనజాక్షి, నాటి గుంటూరు జడ్పీ చైర్మన్ జానీమూన్ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని వనిత సూచించారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. నేడు టిడిపి మహిళా నేతలు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం హాస్యాస్పదమన్నారు,. గట్టిగా మాట్లాడితే నిజాలు అబద్ధాలు అయిపోతున్నయన్న భ్రమలో టిడిపి నేతలున్నారని విమర్శించారు.

మహిళలకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుందనే దానికి తమ మూడేళ్ళ పాలనే నిదర్శనమని, మహిళా భద్రతకు దిశా చట్టం, యాప్ కూడా తీసుకు వచ్చామన్నారు.  గోరంట్ల మాధవ్ ద్వారా తమ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుజేయడానికి కుట్ర పూరితంగానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు.

Also Read : తప్పు తేలితే కఠిన చర్యలు: భరత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్