Monday, June 8, 2026
HomeTrending Newsకావాలనే రెచ్చగొడుతున్నారు: సుచరిత

కావాలనే రెచ్చగొడుతున్నారు: సుచరిత

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే నీచమైన భాష ఉపయోగిస్తూ రెచ్చగొట్టే రాజకీయాలు చంద్రబాబు నడుపుతున్నారని ఆమె విమర్శించారు.  భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చిందని, అయితే పట్టాబి మాట్లాడే బాష సభ్య సమాజం తలదించుకొనేలా వుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పాలెగాళ్లు, దద్దమ్మలు అంటూ వ్యాఖ్యానించడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం సుబిక్షంగా వుందన్నారు.

గుజరాత్ లో డ్రగ్స్ దొరికితే ఏపిని డ్రగ్స్ మాఫియాగా మార్చారని అనడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.  గంజాయి రవాణా అరికట్టడానికి స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (సెబ్) ఏర్పాటు చేశామని చెప్పారు.  డ్రగ్స్ వ్యవహారంలో నక్కా ఆనందబాబు నిన్న చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు అడిగేందుకే పోలీసులు వచ్చారని, కేవలం సమాచారం మాత్రమే అడిగారని సుచరిత స్పష్టం చేశారు. టిడిపి నేతలు ప్రభుత్వంపై, సిఎం జగన్ పై పదే పదే బురద చల్లుతున్నారని ఆమె మండిపడ్డారు. వ్యక్తి గతంగా దూషించడం తగదని ఆమె సూచించారు.

డిజిపి ఆఫీస్ కి కూతవేటు దూరమున్నా దాడి చేశారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘మీ కార్యకర్తలను మీరే ప్రేరేపించి దాడులు చేయించారని అనుమానం వస్తుంది’ అంటూ సుచరిత వ్యాఖ్యానించారు.  టిడిపి కార్యాలయంపై దాడిని ఖండించిన మరొక నాయకుడు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని తిట్టడాన్ని ఎందుకు ఖండించరని ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబు ఫోన్ చేస్తే డిజిపి స్పందించలేదన్న ఆరోపణలు నిజం కాదని, డిజిపి ఎల్లుండి జరిగే అమరవీరుల స్మారక దినోత్సవం పరేడ్ రిహార్సల్ లో ఉన్నారని ఆమె వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular