Friday, March 29, 2024
HomeTrending Newsబయో ఇథనాల్ ప్లాంట్ కు ఎస్‌ఐపీబీ ఆమోదం

బయో ఇథనాల్ ప్లాంట్ కు ఎస్‌ఐపీబీ ఆమోదం

SIPB: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్‌ భారతి కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (క్రిబ్కో) ఆధ్వర్యంలో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ)  ఆమోదం తెలిపింది.  రూ.560 కోట్లతో 250 కె.ఎల్‌.డి. సామర్థ్యంతో, 100 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ  ప్లాంట్‌ ద్వారా 400 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వీటితో పాటు మరిన్ని విత్తనశుద్ధి సహా వివిధ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని క్రిబ్కో సంస్థ ప్రభుత్వానికి తెలియజేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ 2022–27లో మరిన్ని చర్యలు చేపట్టనుంది.  ఇప్పుడున్న ఎగుమతులను 5 ఏళ్లలో రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే  ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్లు ఎగుమతులు సాధించాలని లక్ష్యం. దీనిలో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోద ముద్ర వేసింది.

రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా రంగం నుంచి ఎగుమతులు ఉన్నాయని, ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రివైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

దేశంలో మెరైన్‌ ఎగుమతుల్లో 46శాతం రాష్ట్రం నుంచే ఉన్నాయని,  అందుకే ఈ రంగాన్ని తగిన విధంగా ప్రోత్సహించాలని కోరారు.  సింగిల్‌డెస్క్‌ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.  అత్యంత పారదర్శక విధానాల్లో భాగంగా ఈ మార్పులను తీసుకు వచ్చామని… విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు  చేస్తున్నామని పేర్కొన్నారు.

ఎస్‌ఐపీబీ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి మత్యాలనాయుడు, ఆర్ధిక, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణం, గనులు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కార్మిక, ఉపాధిశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌ కె రోజా, సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : ఛాలెంజ్ గా తీసుకుని పనిచేద్దాం: సిఎం సూచన

RELATED ARTICLES

Most Popular

న్యూస్