Saturday, September 14, 2024
Homeసినిమాహాట్ టాపిక్ గా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సీక్వెల్!

హాట్ టాపిక్ గా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్!

తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన చెప్పుకోదగిన చిత్రాలలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఒకటి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. చిరంజీవి – శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా, కథాకథనాల పరంగా .. పాటల పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పట్లో 2 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 15 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అశ్వనీదత్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలలో ఇది ఒకటి.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో అశ్వనీదత్ చాలాకాలంగా ఉన్నారు. ఆయన ఫ్యామిలీలోకి నాగ్ అశ్విన్ ఎంటరైన దగ్గర నుంచి ఆయనలో ఈ ఆలోచన మరింతగా బలపడుతూ వచ్చింది. ఎందుకంటే నాగ్ అశ్విన్ కి కథాకథనాలపై ఎంతటి పట్టు ఉందో, విజువల్స్ పై కూడా అంతే అవగాహన ఉంది. చరణ్ – జాన్వీ కపూర్ తో ఈ సినిమా సీక్వెల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల నుంచి పెద్ద స్థాయిలో వ్యక్తమైంది. నిజంగానే ఈ కాంబినేషన్ ప్రాజెక్టుపై క్రేజ్ ఒక రేంజ్ లో పెరగడానికి కారణమవుతుందని అంతా భావించారు.

ఇప్పుడు మళ్లీ ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. ‘ఇంద్ర’ సినిమాను రీ రిలీజ్ చేసిన సందర్భంలో మెగాస్టార్ ఇంట్లో ఒక సమావేశం జరిగింది. ఈ సందర్భంలోనే ‘ఇంద్ర’ .. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలకు సీక్వెల్ చేయాలనే ఆసక్తిని అశ్వనీదత్ వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ‘ఇంద్ర’ సీక్వెల్ సంగతి అలా ఉంచితే, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అనుకోవచ్చు. ‘కల్కి’ సీక్వెల్ తరువాత నాగ్ అశ్విన్ రంగంలోకి దిగుతాడేమో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్