Monday, May 20, 2024
Homeసినిమా200 కోట్ల రూపాయల వెబ్ సిరీస్ .. 'హీరామండి' 

200 కోట్ల రూపాయల వెబ్ సిరీస్ .. ‘హీరామండి’ 

ఇపుడు వెబ్ సిరీస్ ల జోరు కొనసాగుతోంది. కంటెంట్ ఉంటే చాలు, ఒకేసారి వివిధ భాషల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో వెబ్ సిరీస్ లపై పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి నిర్మాతలు ఎంతమాత్రం వెనుకాడటం లేదు. సినిమాల నిర్మాణానికి ఎంతమాత్రం తగ్గని ఖర్చుతో వెబ్ సిరీస్ లను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సారి ఆ ఖర్చు 200 కోట్ల రూపాయలకు చేరుకుంది. అలా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన వెబ్ సిరీస్ ‘ హీరామండి’.

ఇండియాలో ఒక వెబ్ సిరీస్ కోసం ఇంతమొత్తం కేటాయించడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ కి దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలి. మనీషా కొయిరాలా .. సోనాక్షి సిన్హా .. రిద్ధి కుమార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, నిన్నటి నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. 1920 ప్రాంతంలో పాకిస్థాన్ – లాహోర్ లో నడిచే కథ ఇది. అక్కడి వేశ్యల నివాస ప్రాంతమైన ‘హీరామండి’ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా మల్లికా జాన్ పాత్రలో కనిపిస్తుంది. వేశ్యాగృహ నిర్వహణ మొత్తం ఆమె చేతుల మీదుగా జరుగుతూ ఉంటుంది. అక్కడి శ్రీమంతులైన నవాబులంతా ఆమె కనుసన్నలలో నడచుకుంటూ ఉంటారు. ఆమెతో తలపడే ఫరీదా పాత్రలో సోనాక్షి కనిపిస్తుంది. ఒక వైపున ఆంగ్లేయులపై పోరాటానికి సంబంధించిన సన్నాహాలు, మరో వైపున హీరామండిలో మారిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అద్భుతమైన దృశ్యాలతో .. ఆకట్టుకునే సన్నివేశాతో ఈ సిరీస్ ఇప్పుడు దూసుకుపోతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్