Friday, March 29, 2024
HomeTrending Newsఢిల్లీలో కెసిఆర్... రెండు రోజుల పాటు యాగం

ఢిల్లీలో కెసిఆర్… రెండు రోజుల పాటు యాగం

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఆవిర్భావం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, ఎంపీలు సంతోష్‌కుమార్‌, దీవకొండ దామోదర్‌రావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్‌రెడ్డి, పీ రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్‌, పార్థసారథిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరికొందరు మంగళవారం చేరుకోనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు తరలివచ్చే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ విధి విధానాలను కూడా కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉన్నది.

ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మంగళ, బుధవారాల్లో యాగాలు, పూజాదికాలు నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్‌ విజయవంతం కావాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం తలపెట్టారు. ఇందుకోసం ప్రత్యేక యాగశాలను నిర్మించారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం 9 గంటలకు 12మంది ఋత్విక్కులు గణపతి పూజతో యాగాన్ని మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే వీరు ఢిల్లీకి చేరుకున్నారు. పుణ్యహవాచనం, యాగశాల సంసారం, యాగశాల ప్రవేశం, చండీపారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. బుధవారం నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్