Friday, March 13, 2026
HomeTrending Newsతైవాన్ గగనతలంలో చైనా దుస్సాహసం

తైవాన్ గగనతలంలో చైనా దుస్సాహసం

కొద్దిరోజులుగా తైవాన్ దేశాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న చైనా ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. తైవాన్ జలసంధిలో ఆ దేశానికి దగ్గరగా యుద్ధ నౌకలు పంపి అలజడి సృష్టించిన చైనా… అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు తీవ్రంగా అడ్డుకోవటంతో కొద్ది రోజులు విరామం ఇచ్చింది. తాజాగా 18 యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిన చైనా.. మరోసారి తీవ్రస్థాయిలో కవ్వింపులకు దిగింది. వాస్తవానికి గత ఏడాది చివరి నుంచి చైనా చొరబాట్లు పెరిగాయి. 2021 అక్టోబర్‌ 4న చైనాకు చెందిన 56 యుద్ధ విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి వెళ్లాయి. ఈ ఏడాది జనవరిలో చైనా 39 యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపింది.

రష్యా – ఉక్రెయిన్ యుద్దంతో అన్ని దేశాలు దృష్టి సారించిన వేళ  ఇప్పుడు యుద్ధ విమానాలతో తైవాన్ దేశంలోకి వెళ్లి రావటం షరామాములుగా మారింది. ఫిలిప్పీన్స్ సముద్రం, తూర్పు చైనా సముద్రంలో పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను మోహరించిన చైనా ఏ క్షణమైనా తైవాన్ పై సైనిక చర్యకు దిగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. చైనా దుస్సాహసం చేస్తోందని జపాన్ తీవ్రంగా విమర్శించింది.

ఉక్రెయిన్ తరహాలో తమకు కూడా ప్రపంచ దేశాల సాయం అందుతుందని తైవాన్ భావిస్తోంది. అయితే ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. కానీ చైనా ఒత్తిడితో చాలా దేశాలు తైవాన్‌ను స్వతంత్ర దేశంగా ఇప్పటికీ గుర్తించలేదు. అదీగాకుండా ప్రపంచ కర్మాగారంగా ఉన్న చైనా నుంచి ప్రపంచ దేశాలకు భారీ మొత్తంలో ఎగుమతులు జరుగుతుంటాయి. రష్యాతో పోలిస్తే చైనా ఆర్థికంగానూ బలంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. ఒకవేళ జిన్‌పింగ్ గనుక తైవాన్‌ను ఆక్రమించాలని భావిస్తే.. ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, పశ్చిమ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Also Read : తాలిబాన్ల కోసం చైనా తాపత్రయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular