Saturday, July 27, 2024
Homeసినిమాఅందుకే.. 'బేబి' ఫంక్షన్ కి వచ్చాను - చిరంజీవి

అందుకే.. ‘బేబి’ ఫంక్షన్ కి వచ్చాను – చిరంజీవి

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘బేబీ’ మెగా కల్ట్ సెలబ్రేషన్స్ చిరంజీవి అతిథిగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కు షీల్డ్స్ అందించి విశెస్ చెప్పారు చిరంజీవి.

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ… నేను బేబి సినిమా విజయోత్సవ సభకు వచ్చానా లేక నా సన్మాన సభకు వచ్చానా అర్థం కావడం లేదు. నన్ను అభిమానిస్తూ, ప్రేమిస్తూ వాళ్ల మనసులో మాటను నాకు చెబుతున్న నా అభిమానులందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నా. పుత్రోత్సాహం ఎలా ఉంటుందో అనుభవిస్తున్నాను, అలాగే తమ్ముళ్ల అభివృద్ధిని చూసి ఆనందిస్తున్నాను. అలాగే నా మేనళ్లుల్లు, మిత్రులు నాతో పాటు ఎదుగుతూ విజయాలు పొందుతుంటే సంతోషపడుతున్న నాకు.. దేవుడు ఇచ్చిన తమ్ముళ్లైన అభిమానులు.. నన్ను స్ఫూర్తిగా తీసుకుని… మనం కూడా సాధించవచ్చు అని తమకంటూ ఒక మార్కు చూపిస్తూ ,సక్సెస్ అందుకుంటుంటే ఎంతో హ్యాపీగా ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహారణ ఈ బేబీ ఫంక్షన్.

ఎస్కేఎన్ సాయిరాజేష్ ఎప్పటినుంచో తెలుసు. వాళ్లను నేను తరుచూ కలవకున్నా వాళ్లు చేసే సినిమా ప్రయత్నాల గురించి వింటూనే ఉంటాను. అభిమానులు అంటే థియేటర్ లో సినిమా చూసే దగ్గరే ఆగిపోవడం కాదు..ఇలా మమ్మల్ని, మా సినిమాల్ని చూసి పొందిన స్పూర్తి ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చా ఇలా తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ విజయాలు సాధిస్తున్నారంటే అందుకు నాకంటే సంతోషించేవారు ఉండరు. హీరోల అభిమానులంటే ఒక లక్ష్యం లేకుండా తిరుగుతారు, చదువుల మీద శ్రద్ధ పెట్టరు. మరో హీరో అభిమానులతో గొడవలు పడతారు అనే రోజుల నుంచీ నాకు తెలుసు. అవి నా చెవిన పడిన సందర్భాలూ ఉన్నాయి. అప్పుడే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టి నా అభిమానులంటే సమాజం గర్వించేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. మారుతి, సాయిరాజేష్, ఎస్కేఎన్ వంటి నా ఫ్యాన్స్ కలిసి చేసిన సినిమా ఘన విజయం సాధించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వాళ్ల సంతోషంలో నేనూ ఒక భాగమవ్వాలని ఈ కార్యక్రమానికి వచ్చాను.

మారుతి సాఫ్ట్ వేర్ కంపెనీకి పనిచేస్తుంటే..ఒక రోజు ఒక పాట ఆడియో ఇచ్చి దీనికి విజువల్స్ తీసుకుని రా అని చెప్పాను. అతను వెళ్లి మంచి విజువల్స్ తెచ్చాడు. అప్పుడే అనిపించింది ఇతనిలో డైరెక్టర్ ఉన్నాడని, ఆ మాటే మారుతికి చెప్పాను. నా మాట నమ్మాడు. ఇవాళ పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేసే దర్శకుడు అయ్యాడు. ఎస్కేఎన్ ఏలూరులో నా సినిమా బ్యానర్స్ కట్టే అభిమాని టైమ్ నుంచి తెలుసు. గీతా ఆర్ట్స్ లో అరవింద్ గారు, బన్నీ సపోర్ట్ తో ప్రొడక్షన్ విషయాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఈరోజుల్లో, టాక్సీవాలా..ఇప్పుడు బేబి మూవీ ప్రొడ్యూస్ చేశాడు. నా అభిమానిగా అతని ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉంది. ఇవాళ ఎస్కేఎన్ ఎంతోమందికి ఇన్సిపిరేషన్ గా నిలిచాడు. అతని స్పీచ్ లు కూడా ఈ మధ్య కొన్ని విన్నాను. సాయి రాజేష్ మొదట్లో స్పూ‌ఫ్ సినిమాలు చేశాడు. కలర్ ఫొటోతో కథా రచయితగా తన సత్తాచాటాడు. జాతీయ అవార్డ్ గెల్చుకున్నాడు. ఇవాళ బేబి మూవీతో ఒక కాంటెంపరరీ మూవీ చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. అతను నా అభిమాని కావడం గర్వంగా ఉంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్