Friday, October 18, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సిబ్బంది సేవలకు వందనం : సిఎం జగన్

సిబ్బంది సేవలకు వందనం : సిఎం జగన్

కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలకు సేవలందిస్తున్న సిబ్బందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘ఈ కోవిడ్‌ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బందితో పాటు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు పగలు రాత్రి కష్టపడుతున్నారు. ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే. కోవిడ్‌ సమయంలో ఎంతో మంచి సేవలందిస్తున్న మీ అందరికీ మా అభినందనలు’ అని స్పందించారు జగన్.

రూ.67 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధన ఆస్పత్రులలో సీటీ స్కాన్‌లు, ఎంఆర్‌ఐ సదుపాయాలను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఫీవర్‌ సర్వే విషయంలో దిగువ స్థాయి సిబ్బంది కొంతమందిపై చర్యలు తీసుకున్నారని నా దృష్టికి వచ్చిందన్న ముఖ్యమంత్రి కరోనా మహమ్మారితో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నారని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. అందుకే అధికారులంతా మంచితనంతో తమ సిబ్బందితో పని చేయించుకోవాలని కోరారు.

ప్రతి రోజూ 20 వేల కోవిడ్‌ కేసులు నమోదవుతున్నా… అందరూ చాలా బాగా పని చేస్తున్నారు కాబట్టే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉందని సిఎం అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్