Saturday, July 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్బ్లాక్ ఫంగస్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు

బ్లాక్ ఫంగస్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్రం కేటాయించిన 1650 వయల్స్ కు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని, సొంతంగా 15 వేల వయల్స్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఏపీకి ఇచ్చే ఆక్సిజన్ కోటాను 625 మెట్రిక్ టన్నులకు పెంచిందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గడిచిన 24 గంటల్లో 1,01,330 కరోనా టెస్టులు చేయగా, 23,160 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 106 మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐసీయూ బెడ్లు 735, ఆక్సిజన్ బెడ్లు 1,075, సాధారణ బెడ్లు 9,378 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 17,886 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో 21,493 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, ప్రైవేటు ఆసుపత్రులకు19,949 ఇంజక్షన్లు సరఫరా చేశామన్నారు.

బ్లాక్ ఫంగస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం…ఏపీకి 1650 వయల్స్ కేటాయించిందని, వాటి కొనుగోలుకు మొన్ననే ఆడర్డర్ ఇచ్చామని, ఈ నెల 22,23 తేదీల్లో సప్లయ్ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఒక్కో పేషంట్ కు 60 వయల్స్ అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారన్నారు. ఒక పేషంట్ కు రూ.3 లక్షల వరకూ వ్యయమవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్లాక్ ఫంగస్ కు వైద్య సేవలను ఆరోగ్య శ్రీ కింద చేర్చామని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్తగా ఆలోచించి 3 కంపెనీల నుంచి 15 వేల వయల్స్ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వాటికోసం ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. అవసరమైతే మరిన్ని వయల్స్ కొనుగోలుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫంగస్ డేటా ఇంకా రావాల్సి ఉందని, అంకెలు దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కరోనా కారణంగా తల్లిదండ్రులు మృతిచెందడం వల్ల అనాథలైన పిల్లల సంరక్షణకు రూ.10 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని తీసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవోలు జారీచేసిందన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథలైన పిల్లలను తక్షణమే గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ఉన్న కమిటీలు రోజూ సమావేశాలు నిర్వహించి, ఫీవర్ సర్వే, హోం ఐసోలేషన్ కిట్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించామన్నారు. ఇపుడిప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందని, రాత్రిబంవళ్లు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్