రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర భూసర్వే ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 2023 నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలని, అవినీతిరహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా సిఎం అధికారులకు పలు సూచనలు చేశారు….
- వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతున్నాం
- సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్డేట్ కావాలి, భూమి కార్డులను రైతులకు ఇవ్వాలి
- అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి
- సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవాలి
- డ్రోన్లు సహా ఇతర టెక్నికల్ మెటీరియల్ను అవసరమైన మేర కొనుగోలు చేయండి
- అవసరమైన సాఫ్ట్ వేర్ ను సమకూర్చుకోవాలి
- సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వండి. దీనికోసం నిపుణుల సేవలు వినియోగించుకోవాలి
- ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, వారికి తగిన శిక్షణ ఇలా అన్ని అంశాలతో సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి
- సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్ సబ్కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలి, సర్వేపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి
- అలాగే స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో కూడా దీనిపై సమీక్షిస్తా
- ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష చేస్తాను
- సర్వే ఆఫ్ ఇండియాతో కూడా సమన్వయం చేసుకోవాలి, వారి సహకారాన్ని కూడా తీసుకొండి:
- సర్వే రాళ్లు కొరత లేకుండా చూడాలి భూగర్భ గనులశాఖ అధికారులకు సీఎం ఆదేశం, సకాలంలో వాటిని అప్పగించాలి
ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్ సిద్దార్ధజైన్, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.