Wednesday, May 8, 2024
HomeTrending Newsనకిలీ చలాన్లపై సిఎం జగన్ ఆగ్రహం

నకిలీ చలాన్లపై సిఎం జగన్ ఆగ్రహం

రాష్ట్రంలో వెలుగు చూసిన నకిలీ చలాన్ల కుంభకోణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా? అంటూ మండిపడ్డారు. తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అసలు నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఇంత పెద్ద స్థాయిలో తప్పులు జరిగినా ఎందుకు తెలియలేదని నిలదీశారు.

ఈ అవినీతికి సంబంధించి అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. చలానాల అక్రమాలు ఎప్పటినుంచి జరుగుతున్నాయో పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కుంభకోణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకోవాలన్నారు. అవినీతిపై ఎవరికి కాల్‌ చేయాలో ప్రతి ఆఫీస్‌లో నంబరు ఉండాలని.. కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్‌ కాల్స్‌పై అధికారులు దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.

అవినీతిని నిర్మూలించడానికి సరైన ఎస్‌ఓపీలను తీసుకురావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. కేవలం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే కాకుండా అన్ని కార్యాలయాల్లో చలానాల చెల్లింపు ప్రక్రియను పరిశీలన చేయాలని సీఎం నిర్దేశించారు.  సాఫ్ట్ వేర్ మొత్తాన్ని నిశితంగా పరిశీలన చేశామని ఆర్థికశాఖ అధికారులు సిఎంకు వివరించారు.  అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని వివరణ ఇచ్చారు. మీ–సేవల్లో పరిస్థితులపైనా కూడా పరిశీలన చేయాలని సిఎం సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్