Friday, March 29, 2024
HomeTrending Newsఎరువుల ధరలు పెంచొద్దు: కెసియార్ లేఖ

ఎరువుల ధరలు పెంచొద్దు: కెసియార్ లేఖ

KCR Letter: ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసియార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన ప్రధానికి లేఖ రాశారు. ఎరువుల ధరలు పెంచాలన్న ప్రతిపాదనను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధానికి ముఖ్యమంత్రి గారి లేఖ సారాంశం..

గౌరవ నరేంద్ర మోడీ గారికి,

కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కొన్ని అంశాలు నా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నదనే విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రైతుల ఆదాయాన్ని 2022 వరకు అంటే ఆరేండ్లలో రెట్టింపు చేస్తానని కేంద్ర ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో ప్రకటించింది. ఐదేండ్లు గడుస్తున్నా ఈ దిశగా ఎటువంటి నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టలేదు. పైగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన  మీ విధానానికి వ్యతిరేకంగా రైతుల వ్యవసాయ పెట్టుబడి ధరలు మాత్రం రెట్టింపు కావడం అందరినీ నిరాశా నిస్పృహలకు గురిచేస్తున్నది.   ఈ ఐదేండ్లలో రైతుల ఆదాయం క్షీణించడంతో యావత్ రైతాంగంలో ఆందోళనకర పరిస్థితులకు దారితీసింది.

గత ఆరేండ్లుగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం  గుడ్డిగా వ్యవహరించడమే గాకుండా యూరియా, డిఎపి తదితర ఎరువుల వాడకాన్ని తగ్గించాలంటూ ప్రచారం చేయాలని రాష్ట్రాలను పురిగొల్పుతున్నది. రైతులు ఎక్కువగా వినియోగించే 28.28.0 ఎరువుల ధరలను 50% కి, పొటాషియం ఎరువు ధరను 100% కి గత 90 రోజుల్లోనే పెంచడం శోచనీయం. ఎరువుల ముడిసరుకుల మీద పెరుగుతున్న దిగుమతి సుంకాన్ని భరిస్తూ ధరలను రైతులకు అందుబాటులో ఉంచాల్సిన కేంద్రం ఆ భారాన్ని రైతుల నెత్తిమీదనే రుద్దుతున్నది. రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణ రోజురోజుకూ పురోగమిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో డీజిల్, పెట్రోల్ వాడకం కూడా పెరుగుతున్న సంగతి మీకు తెలిసిందే. క్రూడాయిల్ ధరలు పెరగకున్నా, కేంద్రం విధిస్తున్న అసంబద్ధ సెస్ చార్జి కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి  రైతులకు అదనపు బాధను కలిగిస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ఎరువుల ధరల పెంపు..ఈ రెండు అంశాల్లో  కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల మూలంగా రైతాంగం తీవ్ర క్షోభను అనుభవిస్తున్నది. దేశంలో ఏడు దశాబ్ధాలుగా కేంద్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఎరువుల సబ్సిడీ విధానాన్ని రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మార్చివేయడం వలన రైతుల్లో తీవ్ర ఆందోళన కలుగుతున్నది. ఈ విషయాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పదలిచాను. సాగు ఖర్చులో కొంతమేరకైనా ప్రభుత్వం భరిస్తూ రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించవచ్చని భావించి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యకలాపాలకు అనుసంధానించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంతవరకూ దీనిపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర అందించే విషయంలో ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్  చేసిన పలు కీలక సిఫారసులను  కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టింది. ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించడం రైతాంగాన్ని పక్కదారి పట్టించడమే. ఎం.ఎస్.విశ్వనాథన్ కమిషన్ చేసిన కీలకమైన మూడు సిఫారసులను పక్కకు పెట్టడం ద్వారా మద్ధతు ధర విషయంలో రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీరని నష్టం చేస్తున్నది. ‘‘వ్యవసాయ సాగులో చోటుచేసుకునే మొత్తం ఉత్పత్తి వ్యయంలో 50% మద్ధతు ధరకు జోడించాలి’’ అనే సిఫారసుతో పాటు ’’భూమి లీజు ధరలను కూడా ఉత్పత్తి వ్యయంలో కలుపాలి’’ అనే సిఫారసును, ‘‘సాగులో రైతు వినియోగించే ట్రాక్టర్లు, యంత్రాలు తదితర స్వంత వ్యవసాయ సాగు ఆస్తులు తదితరాల వ్యయాన్ని ఉత్పత్తి వ్యయానికి జోడించాలి’’ అనే మరో కీలక సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగా పక్కకుపెట్టింది. ఈ నేపథ్యంలో తద్వారా ఎం.ఎస్.స్వామినాథన్ సిఫారసుల ప్రకారం 150% మద్ధతు ధరను అమలుపరుస్తున్నామని కేంద్రం ప్రకటించుకోవడం దేశ రైతాంగాన్ని తప్పుదారి పట్టించమే అవుతుంది.

మరోపక్క మద్ధతు ధర ప్రకటించినట్టే ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనకుండా కొంత శాతాన్నే కొంటున్నారు.  రైతాంగానికి తన పంటకి మద్ధతు ధర లభిస్తుందనే భరోసాను కలిగించడంలో కేంద్రానికి సరైన వ్యవస్థ లేనే లేదు. అంతేకాకుండా అంతర్జాతీయ నాణ్యత పేరుతో కనీస మద్ధతు ధర పొందడానికి రైతులు నిరాకరించబడుతున్నారు. వారు పండించిన పంటను మార్కెట్లో తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితుల్లోకి దేశ రైతులు నెట్టివేయబడుతున్నారు. ఇటువంటి కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో వ్యవసాయాన్ని లాభసాటి వ్యవహారం కాకుండా చేస్తున్నారు. ఎరువుల ధరలు పెంచడం ద్వారా, డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనం ధరలను పెంచడం ద్వారా, కనీస మద్ధతు ధరను నిర్ధారించడంలో తప్పుడు విధానాలు అనుసరించడం ద్వారా వ్యవసాయ సాగు ఖర్చులను పెంచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం తన వాగ్ధానాన్ని తానే ఉల్లంఘిస్తున్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ తప్పుడు విధానాలకు తోడుగా వ్యవసాయ రంగంలో విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ మోటర్లకు మీటర్లు బిగించడమనే నిర్ణయం,  కష్టజీవులైన దేశ రైతాంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఎరువుల ధరలను పెంచకుండా చూడాలని, రైతుల నెత్తిమీద భారం మోపకుండా  అధిక ధరలను కేంద్రమే భరించాలని ఈ సందర్భంగా కోట్లాది దేశ రైతాంగం తరపున కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను…. అంటూ లేఖలో పేర్కొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్