Monday, June 15, 2026
HomeTrending NewsTDP: వ్యక్తిగత దూషణలు మానుకో: కన్నా సూచన

TDP: వ్యక్తిగత దూషణలు మానుకో: కన్నా సూచన

సిఎం జగన్ అధికారిక కార్యక్రమాల్లో దిగజారుడు రాజకీయాలు మాట్లాడుతున్నారని, ఇది ఆయనలోని ఓటమి భయాన్ని సూచిస్తోందని టిడిపి నేత కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ  డబ్బులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్ని రాజకీయాలైనా మాట్లాడొచ్చని, కానీ  ప్రభుత్వ సొమ్ముతో జరిగిన సభలో రాజకీయ విమర్శలు చేయడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల క్రితం మాట్లాడినప్పుడు అందరూ కలిసి వచ్చినా  తన వెంట్రుక కూడా పీకలేరంటూ మాట్లాడారని, ఆ తర్వాత రైతుల మీటింగ్ లో కూడా రాజకీయాలే మాట్లాడారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో అధికార నేతలు, కార్యకర్తలు అమ్ముతున్న కల్తీ విత్తనాలకు రైతులు బలైపోతున్నారని, అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతుంటే పలకరించే దిక్కు లేదని, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డున పడ్డారని, ఈ సమయంలో వారిని ఎలా ఆదుకుంటారో చెప్పాలని…. కానీ ఈ సమస్యలపై స్పందించడం చేతగావడం లేదు కానీ ప్రజా ధనాన్ని తాత ముల్లె లాగా వాడుకుంటూ ప్రతిపక్షాలను తిట్టడం కోసం ఈ సభలను వినియోగించం చూస్తుంటే గురివింద సామెత గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు.

విపక్షాలు ఏదైనా సమస్య లేవనెత్తితే సమాధానం చెప్పాలని, చేతగాకపోతే తప్పుకోవాలని కన్నా సూచించారు. వ్యక్తిగత విమర్శలు సరికావన్నారు. చంద్రబాబు ఈ రోజుకీ 18 గంటలు పని చేస్తున్నారని, యువకుడని చెప్పుకుంటున్న జగన్ కనీసం 10 కిలోమీటర్ల కార్యక్రమానికి కూడా హెలీకాఫ్టర్ లో వెళుతున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ళలో చెప్పుకోవడానికి ఏమీ లేకనే విపక్షాలపై ఈ తరహా విమర్శలు చేస్తున్నారని, ఇకనైనా స్థాయి మరిచి మాట్లాడవద్దని, వ్యక్తిగత దూషణలు మానుకోవాలని  కన్నా సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular