Thursday, April 25, 2024
HomeTrending Newsవిద్యుత్ పొదుపు పాటించాలి :బాలినేని

విద్యుత్ పొదుపు పాటించాలి :బాలినేని

రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండబోతున్నాయి, ఈ విషయాన్ని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిన్న సూత్రప్రాయంగా వెల్లడించగా నేడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా విద్యుత్ కొరత అంశాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో బొగ్గు కొరత ఉందని, ఈ ప్రభావం రాష్ట్రంపై కూడా తీవ్రంగా పడిందని, అందువల్లే విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయని బాలినేని చెప్పారు.  ఏపీ జెన్కో కేంద్రాల్లో బొగ్గు సరఫరా తగినంత లేదని అందుకే రోజుకు 3700 మెగా వాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన ప్లాంట్లు 2  వేల నుంచి 2,200 ఉత్పత్తి చేయగలుగుతున్నాయని వివరించారు.  బొగ్గు సరఫరా మెరుగుపడేందుకు కనీసం మూడు నెలల సమయం పట్టొచ్చని అందుకే ప్రజలు విద్యుత్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు

వేసవిలో విద్యుత్ కొరత ఇంకా ఎక్కువగా ఉంటుందని, శీతాకాలంలో ప్రజలు విద్యుత్ వాడకంలో పొదుపు పాటించాలని సజ్జల ప్రజలకు నిన్న విజ్ఞప్తి చేశారు. బొగ్గు కొరత లేదంటూ కేంద్రమంత్రి చెప్పిన విషయాన్ని ఖండించారు. నిధులు వెచ్చించినా విద్యుత్ దొరకని పరిస్థితి ఉంటుందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అందుకే గృహ వినియోగదారులు జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ముందుగా గృహ వినియోగదారులపై ఈ ప్రభావం ఉండబోతోంది. సాయంత్రం 6 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో గృహ వినియోగంలో విద్యుత్ కోతలు ఉంటాయి. రాష్ట్రంలో రోజుకు 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే ప్రస్తుతం 145 యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. యాభై యూనిట్లు కొరత ఏర్పడింది. బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో మరో రెండు మూడు రోజుల్లో సరఫరా అయ్యే విద్యుత్ మరింత తగ్గే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం జగన్ లేఖ రాశారు,

RELATED ARTICLES

Most Popular

న్యూస్