Wednesday, March 11, 2026
HomeTrending Newsవిద్యాసంస్థల మూసివేతకు తొందరెందుకు

విద్యాసంస్థల మూసివేతకు తొందరెందుకు

Corona Effect On Children :

ఓమిక్రాన్ భారతదేశంలో అడుగుపెట్టగానే అన్నిటికన్నా ముందు ప్రారంభమైన చర్చ “విద్యా సంస్థలు ఎప్పుడు మూతబడుతాయని” ఓమిక్రాన్ వైరస్ మొదటగా సౌతాఫ్రికాలో కనిపెట్టారు, తర్వాత వైరస్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రబలినది. ప్రస్తుతం వందకు పైగా దేశాల్లో దీనికి సంబంధించిన కేసులు కనిపిస్తున్నాయి.

అమెరికా వంటి దేశాల్లో రోజుకు 5 లక్షల పైబడి కూడా కేసులు నమోదవుతున్నాయి. యూరోపియన్ దేశాల్లో కూడా కేసుల సంఖ్య భారీగా ఉంటుంది. అక్కడ కొన్ని దేశాల్లో రోజుకు 50 వేల నుండి రెండు లక్షల కేసుల వరకు నమోదయ్యాయి. ఇలా అనేక యురోపియన్ దేశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా ఈ వైరస్ విస్తృతంగా ప్రబలింది.
ఈ వైరస్ అతి త్వరలో ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రవేశించడం ఖాయం.

భారతదేశంలో ఈ వైరస్ ప్రవేశించినప్పటి నుండి రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తూ ఆంక్షలు విధిస్తున్నాయి.

ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే లక్షల లక్షల్లో కేసులు ఉన్న దేశాల్లో విద్యా సంస్థలను మూసి వేయడం జరగలేదు. ఇతర రకాల ఆంక్షలు విధిస్తున్నారు. ఎక్కడైతే జన సమూహాలు ఉంటున్నాయో అక్కడ నిషేధాజ్ఞలు విధించారు. విద్యా సంస్థలను మాత్రం మూసి వేయలేదు. దీనికి ప్రధాన కారణం గత రెండు వేవ్ లలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పిల్లలపై తక్కువ ప్రభావం చూపిస్తుందని నిర్ధారణ అయింది. పిల్లలపై తక్కువగా ప్రభావము ఉన్నందున బడులు మూసివేయాలసిన అవసరం అసలే లేదు.

స్వీడన్ వంటి దేశాలలో మొదటి వేవులో కూడా పాఠశాలల్ను మూయలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి వేవ్ లో పాఠశాలను మూసిసినప్పటికీ దాని వల్ల జరుగుతున్న అనర్ధాలను గుర్తించి రెండో వేవ్ సమయంలో తరగతులను రద్దు చేయలేదు. కానీ మన దేశంలో ఇందుకు విరుద్ధంగా మొదటి రెండు వేవ్స్ లో చాలాకాలంపాటు పాఠశాల మూసి ఉంచారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని తరగతులకు ఇంకా తరగతులు ప్రారంభం కాలేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

థర్డ్ వేవ్ ప్రారంభమైందని వార్త తెలియగానే ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక తోపాటు మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు విద్యా సంస్థల మూసివేత నిర్ణయం ప్రకటించారు. 16-17 నెలల పాటు పాఠశాలలు మూసి ఉంచడం వలన జరిగిన నష్టాన్ని, విద్యార్థుల్లో వచ్చిన అవాంఛనీయ మార్పులను మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. విద్యార్థుల్లో పొగతాగే అలవాటు, ఆల్కహాలిజం, ఆపోజిట్ జెండర్ పట్ల పెరిగిన వ్యామోహం, మొబైల్ అడిక్షన్, తిరుగుబాటుతనం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అభ్యసన నష్టం, వివిధ వర్గాల మధ్య అభ్యసన అంతరాలు అందరికి అవగతం అవుతున్నాయి. అభ్యసన పట్ల శ్రద్ధ తగ్గి ఇతర అనవసర అంశాలపై పిల్లలకు శ్రద్ధ పెరిగింది. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, వ్యవసాయ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొగవడం అధికమైంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ విద్యాసంస్థలు మూసివేస్తే ఎప్పటికి తీర్చలేని నష్టం జరిగే అవకాశం ఉంది.

శాస్త్రీయ ఆధారాల ప్రకారం..

1. పిల్లలపై కరోన ప్రభావం అత్యంత స్వల్పం

2. పాఠశాలలు మూసిఉంచడం వల్ల కరోన వ్యాప్తి తగ్గదు

3. పాఠశాలలు దీర్ఘకాలికముగా మూసిఉంచడం వల్ల విద్యార్థులకు దశాబ్దాల పాటు నష్టం జరుగుతుంది

ఇంత స్పష్టమైన ఆధారాలు ఉండగా పాఠశాలల మూసివేత నిర్ణయం అర్ధరహితమని వైద్య రంగ నిపుణులు, మేధావులు అంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ విషయంలో సహేతుకమైన నిర్ణయం తీసుకుని పాఠశాలలు, విద్యా సంస్థలు యధావిధిగా నడపాలని కోరుతున్నారు.

Also Read : ఓమిక్రాన్ డేంజర్ కాదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular