Friday, April 19, 2024
HomeTrending Newsథర్డ్ వేవ్ ముగిసినట్టే - వైద్య ఆరోగ్య శాఖ

థర్డ్ వేవ్ ముగిసినట్టే – వైద్య ఆరోగ్య శాఖ

Third Wave End  : రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వారం వ్యవధిలోనే సగానికి పైగా తగ్గాయి. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో 2,850 కేసులు నమోదు కాగా, సరిగ్గా వారానికి 1,380 మాత్రమే నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టడం విశేషం. సోమవారం 68,720 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, అందులో 1,380 మంది వైరస్‌ సోకినట్లు తేలింది. అంటే పాజిటివిటీ 2 శాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.78 లక్షలకు చేరుకుంది. మొత్తం ఏడున్నర లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌‌తో 4,101 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్‌ రాష్ట్రంలో ఇక ముగిసినట్టేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ లో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని, ఐటి కార్యకలాపాలకు ఇక వర్క్ ఫ్రొం హోమ్ అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు  శ్రీనివాస రావు స్పష్టం చేశారు. తెలంగాణలో ఇక నుంచి ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఊపిరి పీల్చుకొనే సమయం వచ్చిందని శ్రీనివాస్ రావు అన్నారు.
తెలంగాణలో మూడోవేవ్‌ కరోనా కేసులు పతాక స్థాయికి చేరడానికి 17 రోజుల సమయమే పట్టిందని పేర్కొన్నాయి. జనవరి మూడో వారంలో కేసులు పతాక స్థాయికి చేరాయని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతి నుంచి క్రమంగా కేసులు తగ్గుతున్నాయని వెల్లడించాయి. ప్రస్తుతం రోజువారీ కేసులు తగ్గుతుండటమే అందుకు నిదర్శనమని చెబుతున్నాయి.

ఒమిక్రాన్‌ కరోనా వేరియంట్‌లోని బీఏ.2 ఉపజాతి వల్లే థర్డ్ వేవ్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. థర్డ్ వేవ్‌లో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పట్టణాల్లో కరోనా వ్యాప్తికి అనుకూల వాతావరణం ఏర్పడింది. తొలుత కేసులు భారీగా నమోదై కలవరపరిచినా.. చాలామందిలో వైరస్ తీవ్రత స్వల్పంగానే ఉండటంతో ఆస్పత్రుల్లో చేరికలు తక్కువగానే జరిగాయి. కొవిడ్‌ రోగుల్లో చాలామంది ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా చికిత్స పొందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్