Thursday, May 30, 2024
HomeTrending Newsతెలంగాణలో లూలు గ్రూప్ పెట్టుబడులు

తెలంగాణలో లూలు గ్రూప్ పెట్టుబడులు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల తొలి రోజే తెలంగాణకు భారీగా పెట్టుబడులు దక్కాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ లో పర్యటిస్తున్న మంత్రి కే తారకరామారావుతో జరిగిన సమావేశాల అనంతరం పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

తెలంగాణలో సుమారు 500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్న లూలు గ్రూప్

తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు లూలు గ్రూపు ముందుకు వచ్చింది. ఈ మేరకు దావోస్ లో మంత్రి కేటీఆర్ తో సంస్థ అధిపతి యూసుఫ్ అలీతో జరిగిన సమావేశంలో ఈ పెట్టుబడిని ప్రకటించింది. ఐదు వందల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. సంస్థ ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం తరఫున అవసరమైన అనుమతి పత్రాలను యూసుఫ్ అలీకి మంత్రి కేటీఆర్ అందించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి తెలంగాణలో మరో ప్రాంతంలోనూ తమ యూనిట్ ప్రారంభించే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు యూసుఫ్ అలీ తెలిపారు. తమ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు సంబంధించి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంతం నుంచి యూరప్ వంటి విదేశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో తమ యూనిట్ ఉండబోతున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో తమ గ్రూప్ తరఫున మరిన్ని పెట్టుబడులను భారీ కమర్షియల్ కాంప్లెక్స్ ల నిర్మాణాల కోసం పెట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలను ఎంచుకున్నామని, అయా ప్రాపర్టీ యజమానులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతమైన షాపింగ్ మాల్ నిర్మించాలన్నది తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి అని, ఇక్కడ లూలూ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా వ్యవసాయోత్పత్తులకు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తుందని, ఈ దిశగా లూలు గ్రూప్ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఐదు వందల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్న లూలూ గ్రూప్ కి ధన్యవాదాలు తెలిపారు.


హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ మరియు బీమా దిగ్గజం స్విస్ రే

స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్ రంగానికి చెందిన స్విస్ రే (swiss re) హైదరాబాద్ నగరంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు కంపెనీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేరోనికా స్కాట్టి, యండి పబ్లిక్ సెక్టార్ సొల్యూషన్స్, ఇవో మెంజింగ్నర్ మంత్రి కే తారకరామారావు తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వేరోనికా మంత్రి కేటీఆర్ కి తెలిపింది. తొలుత 250 మంది ఉద్యోగులతో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, తర్వాత దశలవారీగా ఈ సంఖ్యను మరింతగా పెంచుకుంటూ వెళ్తామని తెలిపారు. హైదరాబాద్ కార్యాలయం ద్వారా తమ సంస్థ యొక్క డాటా మరియు డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడం, తమ సంస్థ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను రూపొందించడం, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపైన పని చేస్తామని తెలిపారు. తమ సంస్థకు అవసరమైన ఇన్నోవేషన్ మరియు ఇతర అంశాలకు సంబంధించి తెలంగాణలోని t-hub వంటి ఇంకుబేటర్ లతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

160 సంవత్సరాల స్విజర్లాండ్ బీమా దిగ్గజం హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంస్థ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేరోనికా కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో బ్యాంకింగ్ ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్ కి చెందిన అనేక కంపెనీలు పనిచేస్తున్నాయని, ఈ రంగానికి అవసరమైన అనుకూల ఈకో సిస్టం హైదరాబాద్ నగరంలో ఉందన్నారు. భారతదేశ జీవిత బీమా నియంత్రణ చేసేయ్ ఐఆర్డిఎ (IRDA) సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తుందని కేటీఆర్ గుర్తు చేశారు. స్విస్ రే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున తన కార్యకలాపాలు విస్తరిస్తున్న విశ్వాసం తనకు ఉందని, హైదరాబాద్ నగరంలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో తమ రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్న కీమో ఫార్మా

స్పానిష్ మల్టీ నేషనల్ కంపెనీ హైదరాబాద్ నగరంలో 100 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ రామారావు కి తెలిపింది. స్పెయిన్ దేశానికి చెందిన కీమో ఫార్మా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుండగా దీనికి అదనంగా తన రెండో ఉత్పత్తి యూనిట్ ను 100 కోట్ల రూపాయలతో ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 2018 సంవత్సరంలో కంపెనీ క్వాలిటీ కంట్రోల్ మరియు స్టెబిలిటీ ల్యాబ్స్ వంటి విభాగాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించిందని, ప్రస్తుతం స్థాపించనున్న రెండవ యూనిట్ ద్వారా తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడితో పాటు సమీప భవిష్యత్తులో ఆక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ ( ingredient) మరియు పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

మంత్రి కేటీఆర్ తారకరామారావు తో సమావేశమైన కీమో గ్రూప్
పరిశోధన అభివృద్ధి డైరెక్టర్ జీన్ డానియల్ బోనీ ఈ మేరకు సంస్థ ప్రకటనను తెలియజేశారు. 2018 నుంచి కార్యకలాపాలు హైదరాబాద్ నగరంలోని జీనోమ్ వ్యాలీ కేంద్రంగా కొనసాగుతున్నాయని, అప్పటినుంచి తమ సంస్థ దినదినాభివృద్ధి చెందుతున్న విషయాన్ని డైరెక్టర్ జీన్ తెలిపారు. ఇప్పటికే తాము సుమారు 170 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టామని, 270 మంది ఉద్యోగులున్నారని, త్వరలో ఈ అదనపు ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమకు సుమారు 10 దేశాల్లో తయారీ యూనిట్లు ఉన్నాయని తెలిపిన జీన్, హైదరాబాద్ నగరంలో తమ అభివృద్ధి చాలా బాగుందని తెలిపారు

తెలంగాణ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కీమో గ్రూప్ కి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరానికి లైఫ్ సైన్సెస్ రంగంలో ఉన్న భవిష్యత్తు అవకాశాల గురించి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తులో హైదరాబాద్ కేంద్రంగా ఈ రంగంలో మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్న సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్