తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను విశాఖ నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగంటా  శ్రీనివాసరావు ఖండించారు. ఈ విషయమై  తనకు సంబంధం లేకుండా… మీడియానే తేదీలు, ముహూర్తం అంతా ఖరారు చేస్తోందని, మీడియా ఏది కావాలంటే అది ప్రచారం చేసుకోవచ్చని, ఆ వార్తలతో తనకు ఎలాంటి సమస్యా లేదని వ్యాఖ్యానించారు.  ఏదైనా చేయాలనుకుంటే మీడియాకు చెప్పే చేస్తానని స్పష్టం చేశారు.

డిసెంబర్ 26న  వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా కాపునాడు  అధ్వర్యంలో ఓ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ సన్నాహకంగా కాపునాడు నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో గంటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పార్టీ మార్పు వార్తలపై స్పందించారు.

చిరంజీవి చేతుల మీదుగా కాపునాడు బహిరంగ సభ పోస్టర్ ను విడుదల చేయించాలని అనుకున్నామని, కానీ ఆయన విదేశీ పర్యటనలో ఉన్నందున తిరిగి వచ్చిన తరువాత రిలీజ్ చేస్తామన్నారు. ఇది రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమం కాదని, కేవలం కాపునాడు ఏర్పాటు చేసిన సమావేశమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *