Sunday, June 7, 2026
HomeTrending Newsఉచిత బియ్యం పంపిణీ ఆగష్టు 1 నుంచి: బొత్స

ఉచిత బియ్యం పంపిణీ ఆగష్టు 1 నుంచి: బొత్స

Garib Yojana: ఆగస్టు 1నుంచి ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  పాత జిల్లాల ప్రకారం రాష్ట్రంలోని ఏడు  వెనుకబడిన జిల్లాల్లోని అందరికీ, మిగిలిన జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు, అంత్యోదయ అన్నయోజన కార్డు కలిగిన వారికి ఈ పథకం వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. అయితే ఏడు జిల్లాల్లో ఉన్న రెండు మున్సిపల్ కార్పొరేషన్లు విశాఖపట్నం, తిరుపతి పరిధిలోని లబ్ధి దారులకు మినహాయించి దాని స్థానంలో కొత్తగా ఏర్పాటైన ప్రకాశం జిల్లాను  ఈ పథకంలో చేర్చామని చెప్పారు.  4.63 కోట్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రెగ్యులర్ రేషన్ బియ్యాన్ని ఉదయం పూట ఇంటి వద్ద సరఫరా చేస్తామని, ఉచిత బియ్యాన్ని మాత్రం మధ్యాహ్నం మూడున్నర నుంచి రేషన్ షాపుల వద్దే పంపిణీ చేస్తామని, దీనికోసం కూపన్లు వాలంటీర్ల ద్వారా అందజేస్తున్నామని చెప్పారు. సచివాలయంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తో కలిసి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో నాలుగు కోట్ల 23లక్షల మంది రేషన్ లబ్ధి దారులు ఉన్నారని, వీరిలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డుల ద్వారా 2.68 కోట్ల మందికి మాత్రమే కేంద్రం గరీబ్ కళ్యాణ్ యోజన బియ్యం పంపిణీ చేస్తోందని, మిగిలిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం  2020 ఏప్రిల్  నుంచి 2022 మార్చి వరకు ఉచిత బియ్యం పంపిణీ చేసిందని బొత్స చెప్పారు. అయితే మూడు నాలుగునెలల నుంచి ఉచిత బియ్యం పంపిణీ ఆపామని,  కేంద్రం ఇస్తోన్న ఈ పథకాన్ని ఎలా కొనసాగించాలనే అంశంపై సిఎం జగన్ మంత్రుల కమిటీని నియమించారని, దీని సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకొని కేంద్రానికి తెలియజేశామని, తదనుగుణంగా ఆగస్టు 1నుంచి దీన్ని పునరుద్ధరిస్తున్నామని బొత్స తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేది స్టోరెక్స్ బియ్యమని, కేంద్రం ఉచితంగా ఇచ్చేది నాన్  స్టోరెక్స్ బియ్యమని చెప్పారు.

రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డును తొలగించడం కానీ, ఒక్క రేషన్ దుకాణాన్ని మూసి వేయడం గానీ చేయడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ విషయమై వస్తోన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల బియ్యం కార్డులు ఉంటే 89లక్షల కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన కింద బియ్యం పంపిణీ చేసిందని కరోనా సమయంలో అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్రమే మిగిలిన వారికి కూడా ఉచిత బియ్యం ఇచ్చిందని, అయితే నీతి ఆయోగ్ కూడా మొత్తం కోటి 46లక్ష కార్డులకు ఉచిత బియ్యం ఇవ్వాలంటూ కేంద్రానికి సిఫార్సు చేసిందని చెప్పారు. సిఎం జగన్ కూడా ఈ విషయమై ప్రధాని మోడీకి రెండుసార్లు లేఖ రాశారని గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular