Monday, May 20, 2024
HomeTrending Newsఅన్నపూర్ణగా, మహాలక్ష్మిగా....

అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా….

ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు (అక్టోబర్ 11, సోమవారం)  రెండు రూపాల్లో భక్తులకు ఆశీస్సులు అందిస్తూ కనువిందు చేయనున్నారు.  శుద్ధ పంచమి, షష్టి తిథులు ఒకేరోజు వచ్చినందున  మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు.

అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ త‌ల్లిగా కుటుంబంలో మ‌హిళ‌కు ఉండే పాత్రను చాటిచెప్పే అవ‌తారం.. ఆక‌లితో ఉన్న వారెవ‌రికైనా అన్నం పెట్టి ఆద‌రించాలనే సందేశాన్ని ఈ రూపంలో అమ్మవారు భక్తులకు ఇస్తారు. కుటుంబంలో త‌ల్లి విశిష్టతను ఈ అవతారం చాటి చెబుతుంది.

శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఏ రకమైన బాధలు ఉండవని భక్తుల విశ్వాసం. ఇంకా సకల సంపదల స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో, రెండవ రోజున బాలా త్రిపుర సుందరిగా, మూడోరోజున శ్రీ గాయత్రీ దేవిగా, నిన్న నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా ఆశీస్సులు అందించారు. కోవిడ్ నేపథ్యంలో భక్తుల సంఖ్యను పరిమితం చేసిన ఆలయ అధికారులు, దర్శనం కోసం విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్ధం అనేక ఏర్పాట్లు చేశారు.

రేపు 12-10-2021శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు, ఈ రోజున అమ్మవారిని దర్శించుకుంటే విద్యాబుద్ధులు కలుగుతాయని ప్రతీతి. అందుకే నవరాత్రులలో మూల నక్షత్రం రోజున రద్దీ విపరీతంగా ఉంటుంది. రేపు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

13-10-2021శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి)

14-10-2021శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి)

15-10-2021శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి)

15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్