Wednesday, June 17, 2026
HomeTrending NewsGroundnut crop: పంటల వైవిద్యీకరణకు శ్రీకారం - మంత్రి నిరంజన్ రెడ్డి

Groundnut crop: పంటల వైవిద్యీకరణకు శ్రీకారం – మంత్రి నిరంజన్ రెడ్డి

దేశంలో అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సగటులో మొదటి స్థానానికి చేరుకున్నామన్నారు. హైదరాబాద్ హోటల్ మ్యారిగోల్డ్ లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, ఎస్ఎల్ బీసీ అధ్యక్షులు అమిత్ జింగ్రాన్, జీఎం నాబార్డ్ డాక్టర్ వై.హరగోపాల్, ఆర్ బీఐ డీజీఎం కేఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో పంటల వైవిద్యీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకులు రుణాలు అందించి ప్రోత్సాహించాలని కోరారు. బ్యాంకులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి వాటి స్థాపన మీద దృష్టిపెట్టాలని, వాటి నుండి ప్రజలకు ఉపాధి కలిగే అవకాశాల మీద బ్యాంకులు అధ్యయనం చేయాలన్నారు. ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ఇది వరకే దృష్టిపెట్టిందని, డైరీ రంగాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.

అందుకుగాను బ్యాంకులు డైరీ రంగం మీద అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా సహకరించాలని మంత్రి కోరారు. బ్యాంకులు కేవలం పట్టణాలలోని ఆస్తులు, భూములనే ప్రామాణికంగా తీసుకుంటున్నాయని, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇచ్చే విదేశీ విద్య బ్యాంకు రుణాల గరిష్ట పరిమితి రూ.7.5 లక్షల నుంచి పెంచాలన్నారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల భూముల ధరలు భారీగా పెరిగాయి .. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని బ్యాంకర్లకు సూచన చేశారు.

వేరుశెనగ పంట ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నదని, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో వినియోగించే పీనట్ బట్టర్ కు డిమాండ్ ఉన్నది .. కానీ అక్కడ వేరుశెనగ పంట పండదని మంత్రి అన్నారు. నాణ్యమైన వేరుశెనగ ఉత్పత్తులకు తెలంగాణ అనువైన ప్రాంతం .. అందులో దక్షిణ తెలంగాణ మరింత అనుకూలమన్నారు. అటువంటి పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు ప్రోత్సాహం అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని, వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడానికి క్షేత్రస్థాయి అవకాశాలను పారిశ్రామికవేత్తలే కాకుండా బ్యాంకులు కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. 2022 – 23 సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి బ్యాంకులు ఇచ్చే రుణాలు పెట్టుకున్న లక్ష్యంలో 62 శాతమే చేరుకున్నారని, బ్యాంకులు ఈ రుణాల విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular