ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) పురుషుల ప్రోలీగ్ టోర్నీలో ఇండియా తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది. నెదర్లాండ్స్ లోని ఐండ్హోవెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా పై 2-1 తేడాతో గెలుపొందింది. 16 మ్యాచ్ లు ఆడిన ఇండియా ఎనిమిదింటిలో విజయం సాధించగా ఐదు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. మరో మూడు మ్యాచ్ ల్లో షూటౌట్ ద్వారా విజయం అందుకుని మొత్తం 30 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఇంగ్లాండ్ 12 మ్యాచ్ లు పూర్తి చేసుకొని 26 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంకా నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది కాబట్టి కనీసం రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించినా ఇంగ్లాండ్ ఛాంపియన్ గా నిలుస్తుంది.
నేటి మ్యాచ్ లో తొలి నిమిషంలోనే ఆకాష్ దీప్ సింగ్ ఫీల్డ్ గోల్ ద్వారా స్కోరు బోణీ చేశాడు. 14 నిమిషంలో సుఖ్ జీత్ సింగ్ మరో ఫీల్డ్ గోల్ తో ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. రెండు, మూడు పావు భాగాలలో ఇరు జట్లూ గోల్ సాధించలేకపోయాయి. 58వ నిమిషంలో అర్జెంటీనా తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని పెనాల్టీ కార్నర్ గోల్ చేసింది. దీనితో 2-1తో ఇండియా విజయం సొంతం చేసుకుంది.