మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ టార్గెట్ చేసింది. ఆత్మాహుతి దాడి ద్వారా ఆమెను చంపాలనుకున్న ఐసిస్ ఉగ్రవాది (Islamic State terrorist)ని రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (Federal Security Service) మాస్కోలో సోమవారం అరెస్ట్ చేసింది. ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవాడని ప్రకటించిన రష్యా అధికారులు ఏ దేశానికి చెందిన వ్యక్తీ, పేరు వివరాలు గోప్యంగా ఉంచారు. దర్యాప్తు కొనసాగుతోందని రష్యా అధికారులు తెలిపారు. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇచ్చిన సమాచారంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మహమ్మద్ ప్రవక్తను అవమానిస్తూ ప్రకటన చేసినందుకే నుపూర్ శర్మను హతమార్చేందుకు సిద్డమయ్యానని సూసైడ్ బాంబర్ ప్రాథమిక విచారణలో వెల్లడించాడు.

జూన్ నెలలో నూపుర్ శర్మను చంపేందుకు రిజ్వాన్ అష్రఫ్ అనే ఓ పాక్ జాతీయుడు అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చాడు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లా హిందూమల్కోట్ వద్ద సరిహద్దు దాటి అనుమానాస్పదంగా సంచరిస్తోన్న రిజ్వాన్ను ఈ నెల 16న సరిహద్దు గస్తీ దళం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరో , రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మిలిటరీ ఏజెన్సీ అధికారులు సంయుక్తంగా ఇంటరాగేషన్ మొదలు పెట్టారు. రిజ్వాన్ వద్ద ఉన్న సంచిలోనుంచి 11 అంగుళాల కత్తిని, మతపరమైన సాహిత్యాన్ని, మ్యాపులను, ఆహార పదార్ధాలు, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : అజ్మీర్ దర్గా ఖాదీమ్.. గౌహర్ చిస్తీ అరెస్ట్