Friday, October 18, 2024
HomeTrending Newsడ్వాక్రా సంఘాలకు ఆద్యుడు పివి: కొడాలి

డ్వాక్రా సంఘాలకు ఆద్యుడు పివి: కొడాలి

డ్వాక్రా సంఘాలను తానే కనిపెట్టానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గతంలో పివి నరసిహారావు ప్రధానిగా ఉండగా మహిళా స్వయం సహాయక బృందాల వ్యవస్థను  ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించడం మొదలు పెట్టారని నాని అన్నారు.  కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడిలో వైఎస్సార్ ఆసరా ముగింపు ఉత్సవాల్లో  కొడాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మట్లాడుతూ దేశ చరిత్రలో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. సిఎం జగన్ నాడు పాదయాత్రలో అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటకోసం, ఆర్ధిక పరిస్థితి  బాగా లేకపోయినా రెండు విడతలుగా షుమారు 13 వేలకోట్ల రూపాయలు ఇప్పటివరకూ మాఫీ చేశారని వెల్లడించారు.

వైఎస్ సిఎంగా ఉండగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను లక్షాదికారులుగా చేయాలని ఆలోచించి వారికి పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడం మొదలు పెట్టారని మంత్రి నాని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో గెలవడం కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు తీరా అదికారంలోకి రాగానే ఆ సంగతే మర్చిపోయారని నాని మండిపడ్డారు. బాబు మోసం చేయడంతో బ్యాంకులు మహిళా సంఘాల నుంచి బ్యాంకులు అసలు, వడ్డీ వసూలు చేశారన్నారు. పాదయాత్ర సందర్భంగా అక్కచెల్లెమ్మల ఆవేదనను గుర్తించిన జగన్ రుణాలు మాఫీ చేస్తానని, ఆ మేరకు రుణ మాఫీ సొమ్మును అక్క చెల్లెమ్మల ఖాతాల్లోనే జమ చేస్తున్నారని నాని వివరించారు.

తాము తిరిగి అధికారంలోకి వస్తామని అప్పుడు అంతు చూస్తామంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా అధికారులను బెదిరిస్తున్నారని, ఈసారి బెదిరిస్తే కేసు పెట్టాలని కొడాలి సూచించారు. వైసీపీ నేతలపై దేవినేని అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం కార్యక్రమాల ఇన్ చార్జ్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్