తెలుగు ఇండస్ట్రీలో ఘన విజయం సాధించిన చూడాలని వుంది, శుభలగ్నం, మావిచిగురు, యమలీల మొదలైన సుమారు వంద చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించి ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ అందించారు దివాకర బాబు మాడభూషి. తనకున్న అనుభవంతో అయన రచించిన ‘ఒలికిపోయిన వెన్నెల’ నవలను ఈరోజు సినీ మ్యాక్స్ లో ప్రముఖ దర్శకులు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దివాకర బాబు మాడభూషి మాట్లాడుతూ… “వెన్నెల చాలా హాయిగా అందరికి ఆహ్లాదకరంగా వుంటుంది కానీ.. ఆ వెన్నెల ఒలికిపోతే ఎవరికి అవసరం లేదు. ఎవరూ దాన్ని ఎత్తుకుని దోసిళ్లలోకి తీసుకోలేరు అనే పాయింటును ఒక స్త్రీ పరంగా చెబుతూ, ఒక స్త్రీ యొక్క అంతరంగ మథనాన్ని ఈ ఒలికి పోయిన వెన్నెల నవలలో ఆవిష్కరించడం జరిగింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు ఎంతో బిజీగా ఉన్నాకూడా మా విన్నపాన్ని మన్నించి నేను రాసిన ‘ఒలికిపోయిన వెన్నెల’ ను ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు అని అన్నారు.