Friday, April 19, 2024
HomeTrending NewsBJP: సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ నిరసనలు

BJP: సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ నిరసనలు

దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో అందుకు ధీటుగా బీజేపీ యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ పాలనలో ఏ విధంగా దెబ్బతిన్నదనే అంశంపై ఆయా రంగాల వారీగా వివరించడంతోపాటు వినూత్న రూపాల్లో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం ఏ విధంగా దెబ్బతిన్నది? రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును జనంలోకి తీసుకెళ్లేందుకు సన్నద్దమైంది. అందులోభాగంగా రేపు ఒకవైపు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే, మరోవైపు కిసాన్ మెర్చా ఆధ్వర్యంలో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆదేశం మేరకు నాలుగు రోజుల క్రితమే బీజేపీ నేతలు యాక్షన్ ప్లాన్ పై కసరత్తు చేశారు. రాష్ట్రంలోని పార్టీ సీనియర్ నేతలందరనీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.

• ఈరోజు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన బండి సంజయ్ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, జాతీయ నాయకురాలు ఆకుల విజయ, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్, రాణిరుద్రమదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న, డాక్టర్ పుల్లారావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

• ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రభుత్వం ఏ రంగంపై కార్యక్రమాలు చేపడుతుందో… ఆయా రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంతోపాటు ఆయా రంగానికి సంబంధించిన ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎండగట్టేలా వివిధ రూపాల్లో వినూత్న రీతిలో కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు.

• ఈ నేపథ్యంలో ఈనెల 3న రైతు వ్యతిరేక విధానాలపై జాతీయ, రాష్ట్ర నాయకులతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే…. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. జూన్ 4న పోలీస్ వ్యవస్థను కేసీఆర్ కుటుంబం సొంత ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగించుకుంటోందనే అంశంతోపాటు పోలీసులు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రజల ద్రుష్టికి తేవాలని సూచించారు. జూన్ 5న విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై పడుతున్న భారంతోపాటు కేసీఆర్ పాలనలో విద్యుత్ సంస్థలు ఏ విధంగా దివాళా తీశాయనే అంశంపై తానే స్వయంగా ఎండగట్టేందుకు బండి సంజయ్ సిద్దమయ్యారు.

• కేసీఆర్ పాలనలో పారిశ్రామిక రంగం సంక్షోభానికి గురైన విషయాన్ని జూన్ 6న, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడీపై జూన్ 7న , చెరువుల కబ్జాలపైస 8న, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం కేసీఆర్ పాలనలో సంక్షోభంలో పడిందనే అంశంపై 9న, కేసీఆర్ దుష్పరిపాలనలో పెచ్చరిల్లిన అవినీతిపై 10న, దశాబ్ది తెలంగాణలో కవులు, కళాకారులతోపాటు సాహిత్యకారులకు జరుగుతున్న అన్యాయంపై 11న కార్యక్రమాలపై రూపొందించిన యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని బండి సంజయ్ ఆయా నేతలను కోరారు.

• ఈనెల 12న ప్రభుత్వం ’’తెలంగాణ రన్‘‘ నిర్వహిస్తున్నందున.. అదేరోజు తిరోగమనంలో తెలంగాణ పేరుతో యువమోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ’’రివర్స్ రన్‘‘ నిర్వహించాలని సూచించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై 13న, కుంటుపడ్డ వైద్యంతో ప్రజలు పడుతున్న తిప్పలపై 14న, స్థానిక సంస్థల నిర్వీర్యం, ప్రజాప్రతినిధులు పడుతున్న బాధలపై 15, 16 తేదీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

• గిరిజనులకు ఇచ్చిన హామీలతోపాటు పోడు భూములు, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు పడుతున్న ఇబ్బందులై 17న, ఖాళీ బిందెలతో 18న, హరిత హారానికి కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు ఆ నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందనే అంశంపై 19న, కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ దుర్గతిపై 20న, దేవాలయ భూముల కబ్జా, హిందువులపై జరుగుతున్న దాడులపై 21న, అమరుల యాదిలో… పేరిట తెలంగాణ అమర వీరుల కుటుంబాలతోపాటు ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై జూన్ 22న వినూత్న కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఆ బాధ్యతలను దరువు ఎల్లన్న, పుల్లారావులకు అప్పగించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్