Friday, March 29, 2024
HomeTrending Newsమూడో వేవ్ ను సమర్థంగా ఎదుర్కొందాం..

మూడో వేవ్ ను సమర్థంగా ఎదుర్కొందాం..

Third Wave Effectively : కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకులు జి శ్రీనివాస రావు తో కలిసి, అన్ని జిల్లాల వైద్యాధికారులు, పీవోలు, ఆశా కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధత, వ్యాక్సినేషన్, వైద్య సేవలు తదితర అంశాలపై ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉండాలని ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయడంతో పాటు, 15-18 ఏళ్ల వారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఇండ్లకు వస్తారని, వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్లు అందించాలని సూచించారు. జనవరి 10 నుంచి 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చే కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యం ఇచ్చి, రెండు డోసులు పూర్తి చేసి, బూస్టర్ డోస్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశాల పరిధిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు ఒక్కరు ఉండకూడదనే లక్ష్యంతో పని చేయాలని ఆదేశించారు.

సబ్ సెంటర్, పీహెచ్సీ స్థాయిలోనే చికిత్స…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కోటి హోం ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల కరోనా నిర్ధారణ కిట్లు సమకూర్చుకున్నామని, వీటిని అన్ని జిల్లాల పీహెచ్సీ, సబ్ సెంటర్ స్థాయికి సరఫరా చేయడం జరిగిందన్నారు. ఎవరికి లక్షణాలు కనిపించినా ఎక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి, సాధారణ లక్షణాలు ఉంటే మందుల కిట్లు ఇచ్చి ఇండ్లలో ఐసోలేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని ఆశాలు రోజు వారీ పరిశీలించి, అవసరమైతే వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించాలన్నారు. మూడో వేవ్లో వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రమాదం తక్కువగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చైతన్య పరచాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ప్రజలు అప్పుల పాలు కాకుండా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. పంచాయతీ, మున్సిపల్ సహా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఐసోలేషన్ కేంద్రాలను స్థానికంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే సమయంలో అన్ని ఆసుపత్రుల్లో ఓపీ, గర్భిణులకు సేవలు, దీర్గకాలిక రోగులకు సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా జిల్లా వైద్యాధికారులు చూసుకోవాలన్నారు.

లక్ష్యంతో పని చేద్దాం.. దేశానికి ఆదర్శంగా నిలుద్దాం
కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో వైద్యారోగ్య శాఖ ఎంతో కృషి చేసి ప్రజల ప్రాణాలను కాపాడిందని, ఇప్పుడు అదే స్ఫూర్తితో పని చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆరోగ్య సూచిల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని, ఇందులో ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా ఆశాల కృషి దాగుందని కొనియాడారు. వచ్చే రెండేళ్లలో మొదటి స్థానంలో నిలవాలనే లక్ష్యంతో అందరం కలిసి పని చేద్దామన్నారు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు, ముందుండి వారికి సేవ చేసే అరుదైన అవకాశం ఆరోగ్య శాఖకు దక్కిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, దేశంలోనే తెలంగాణ ఆరోగ్య రంగాన్ని మొదటి స్థానానికి చేర్చాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వానికి ఆశాల ధన్యవాదాలు….
గత ప్రభుత్వాల హయాంలో పారితోషకం పెంపు కోసం ఆశా కార్యకర్తలు ధర్నాలు చేసేవారని, ఇందిరాపార్క్ వద్ద లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. గుర్రాలతో తొక్కించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఆశాల సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మరోసారి ౩౦శాతం పారితోషకం పెంచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆశాలకు సూచించారు. ఆశాల అందరి తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పారితోషకం పెంపు సంతోషాన్ని ఆశా కార్యకర్తలు మంత్రి హరీశ్ రావుతో పంచుకున్నారు. సంకాంత్రి పండుగ సందర్బంగా ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు రుణపడి ఉంటామని ఆశా కార్యకర్తలు టెలి కాన్ఫరెన్స్లో ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రోత్సాహంతో మరింత బాగా పని చేస్తామని, ప్రజల మన్ననలు పొందేలా వైద్య సేవలు అందిస్తామని మంత్రికి తెలిపారు.

Also Read : నిమ్స్ లో అత్యాధునిక వైద్య సదుపాయాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్