Saturday, June 13, 2026
HomeTrending Newsఇది కొత్త పథకం: రోడ్ల గుంతలపై లోకేష్ ఎద్దేవా

ఇది కొత్త పథకం: రోడ్ల గుంతలపై లోకేష్ ఎద్దేవా

రాష్ట్రంలో ఈ  గుంతల రోడ్లు చూస్తే పెట్టుబడులు వస్తాయా, ఏ పారిశ్రామిక వేత్త అయినా ఏపికి వస్తాడా అంటూ తెలుగుదేశం  పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.  చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు రోడ్లు అద్దాల్లా ఉండేవని, జగన్ పాలనలో రోడ్లపై గుంతలు పూడ్చే దిక్కుకూడా లేదని లోకేష్ ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర నేడు 32వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. గుమ్మడి వారి ఇండ్లు నుంచి మొదనిల ఈ యాత్రలో  బందార్లపల్లెలో గుంతలు పడ్డ రోడ్డుమీద లోకేశ్ సెల్ఫీ దిగి, ‘‘ఇది జగనన్న గుంతల పథకం’  అంటూ ఎద్దేవా చేశారు.
ఉపాధ్యాయులతో, యూటిఎఫ్, ఇతర సంఘాల ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. 4ఏళ్లలో ఒక్క డిఎస్సీ నిర్వహించలేదని, వేలాది పాఠశాలలను మూసివేయడం లేదా విలీనం చేయడం వల్ల రాష్ట్రంలో ప్రాధమిక విద్య పూర్తిగా దెబ్బతిందని, పిఆర్ సి, డిఏ బకాయిలు, పిఎఫ్,సిపిఎస్ 10% వాటా, ఇంక్రిమెంట్లు, అలవెన్స్ లు వేలకోట్లు పెండింగ్ పెట్టారని వారు లోకేష్ దృష్టికి తీసుకు వచ్చారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధిస్తున్నారని, నాడు-నేడు పనుల భారం, యాప్ ల ఒత్తిడితో చదువులపై శ్రద్ధ పెట్టనీకుండా ప్రభుత్వమే చేస్తోందని వారు తమ గోడు వెళ్ళబుచ్చారు.
దీనిపై లోకేశ్ స్పందిస్తూ,  ఉపాధ్యాయులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, మద్యం షాపుల వద్ద టీచర్లను కాపలా పెట్టించే హీనానికి ఈ ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు.  ప్రాధమిక విద్యలో ఏపిని దేశంలోనే అట్టడుగుకు పతనం చేశారని,  టీచర్లు ఇంత ఒత్తిడికి గురవ్వడం, మనోవ్యధ చెందడం మున్నెన్నడూ చూడలేదంటూ వ్యాఖ్యానించారు.  టిడిపి అధికారంలోకి రాగానే అక్రమ కేసులన్నీ ఎత్తేస్తామని, కక్షసాధింపు చర్యలు ఉండవని, వారి సేవలను సమర్ధవంతంగా వినియోగించుకుని విద్యారంగంలో ఏపిని దేశానికే అగ్రగామిగా చేస్తామని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular