మధ్యప్రదేశ్లోని టైగర్ రిజర్వ్లలో పులల మరణాలు కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా కూనో నేషనల్ పార్క్లోని చీతాలు మరణిస్తూ వస్తున్నాయి. తాజాగా బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో ఏడు నెలల వయస్సున్న ఆడ పులి పిల్ల అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే మరో పులితో జరిగిన పోరాటంలో అది మరణించి ఉంటుందని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ACF) ఎఫ్ఎస్ నినామా అనుమానం వ్యక్తం చేశారు. పులి పిల్ల కళేబరం దగ్గర మరో పులి పాదముద్రలు కనిపించాయని తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని, డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలోకి దింపినట్లు చెప్పారు. అయితే కూనో నేషనల్ పార్క్లో ఉన్న దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాల్లో ఇప్పటివరకు తొమ్మిది మరణించిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో పులలకు నిలయంగా మధ్యప్రదేశ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గత నెలలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్లో 785 పులులు ఉన్నట్లు తేలింది. కర్ణాటకలో 563, ఉత్తారఖండ్లో 560, మహారాష్ట్రలో 444 పులుల చొప్పున ఉన్నాయి.
మధ్యప్రదేశ్లో కన్హా టైగర్ రిజర్వ్, బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్, సంజయ్-దుబ్రి టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో 135పులులు ఉండగా, ఖానా రిజర్వ్ ఫారెస్టులో 105, పెంచ్లో 77 చొప్పున ఉన్నాయి.