Saturday, September 21, 2024
HomeTrending NewsFish Festival: ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు అపూర్వ స్పందన

Fish Festival: ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు అపూర్వ స్పందన

మహిళా మత్స్యకారులు ఆర్ధిక స్వావలంబన సాధించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం NTR స్టేడియంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ MLA ముఠా గోపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్ని స్టాల్స్ ని తిరిగి సందర్శించి చేపలు, రొయ్యలతో చేసిన ఫ్రై, బిర్యానీ, పకోడీ, పులుసు తదితర వంటకాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎంతో రుచికరమైన వంటకాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను సందర్శించి వంటకాలను రుచి చూడాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రొయ్య పిల్లలను కూడా ఉచితంగా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

ఉచిత చేప పిల్లల పంపిణీ తో భారీగా మత్స్య సంపద పెరిగిందని చెప్పారు. మత్స్యకారులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా మహిళా మత్స్యకారులు చేపలు, రొయ్యలతో చేసే వివిధ రకాల వంటకాలను ప్రజలకు అందుబాటులో కి తేవాలని ఆలోచనతో అన్ని జిల్లా కేంద్రాల్లో సుమారు 800 స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని రానున్న రోజుల్లో 2 వేల వరకు పెంచనున్నట్లు వివరించారు. ఇప్పటికే మత్స్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 600 మంది మహిళా మత్స్యకారులకు వివిధ రకాల వంటకాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా నూతనంగా నిర్మించనున్న చేపల మార్కెట్ లలో మహిళలకే అధిక స్టాల్స్ కేటాయించే లా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రంలోని వివిధ సొసైటీలలో నూతనంగా 18 సంవత్సరాలు నిండిన అర్హులైన లక్ష మంది మత్స్యకారులకు సభ్యత్వాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన మత్స్యకార యువతకు కూడా వంటకాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో మత్స్యకారులకు ద్విచక్ర, ట్రాలీ ఆటోలు, ట్రక్కుల ను సబ్సిడీపై అందించిన విషయాన్ని గుర్తు చేశారు. చెరువులపై పూర్తి హక్కులు మత్స్యకారులకు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 7 వేల కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపద ఉత్పత్తి జరుగుతుందని, రానున్న రోజుల్లో దేశానికి, ఇతర దేశాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ మత్య్సకారులు ఎదుగుతారని చెప్పారు. అదేవిధంగా మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ప్రభుత్వం స్థలాలను కేటాయించడంతో పాటు కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రచన శ్రీ, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, మత్స్య శాఖ అధికారులు మురళి, సుధాకర్, చరితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్