Friday, March 29, 2024
HomeTrending Newsనేటి నుంచి మెగా వాక్సినేషన్

నేటి నుంచి మెగా వాక్సినేషన్

రాష్ట్రంలో  ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో  స్థానిక ప్రజా ప్రతినిధులు,స్వచ్చంద సంస్థలు భాగస్వాములై విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.  ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ నెల 17వ తేది నుంచి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18సం.రాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేందుకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై బుధవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. హైద‌రాబాద్ సచివాలయం  నుంచి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర ఉన్న‌తాధికారులు, వివిధ శాఖల కార్య‌ద‌ర్శులు పాల్గొన్నారు.  జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, జెడ్పీ చైర్మన్లు, డిపివోలు, సీఈవో లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో  కరోనా పూర్తి నియంత్రణ లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకూడదని సదుద్దేశంతో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి  ద‌యాక‌ర్ రావు అన్నారు.  రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు  2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని, ఇప్పటి వరకు రెండు కోట్ల 17 వేలమందికి వాక్సిన్ ఇచ్చామని తెలిపారు. వీరిలో ఒక కోటి 45 లక్షల మందికి  మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింద‌ని,  55 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.  పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్పూర్తితో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలన్నారు.

గ్రామాలు, వార్డు వారిగా ప్రణాళిక చేసుకోవాలి. గ్రామస్థాయి లోనే వ్యాక్సినేషన్ క్యాంపు ఏర్పాటు చేసి అందరికి 100% వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. తహసిల్దారు, యం.పి.డి.ఓ, మెడికల్ ఆఫీసర్ మండల స్థాయి లో సమన్వయం చేసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా పనిచేసిన జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అవార్డులు ప్రకటిస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 1,34,98,073 మంది ఇంకా వాక్సిన్ తీసుకోవాల్సి ఉందని వీరెందరికీ ఈ రోజు నుండి ప్రారంభమయ్యే స్పెషల్ వాక్సినేషన్ కార్యక్రమంలో వేయడం జరుగుతుందని అన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాలలో ఇంటింటికి ఆశా, అంగన్వాడీ, స్థానిక సంస్థల సిబ్బంది వెళ్లి వాక్సిన్ తీసుకొని వారి జాబితాను రూపొందిస్తారని, గుర్తించిన వారికి వాక్సిన్ ఇచ్చి ఆ ఇంటిపై వాక్సిన్ కు సంబందించిన స్టిక్కర్ వేస్తారని పేర్కొన్నారు. ప్రతీ మున్సిపాలిటీకి, మండలానికి వాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్ ను నియంనించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ వార్డు ను యూనిట్ గా చేసుకొని సూక్ష్మ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రతీ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్