Friday, March 29, 2024
HomeTrending Newsకంసాన్‌ప‌ల్లి రైతుల‌కు మంత్రి కేటీఆర్ భరోసా

కంసాన్‌ప‌ల్లి రైతుల‌కు మంత్రి కేటీఆర్ భరోసా

నారాయ‌ణ‌పేట జిల్లాలోని కంసాన్‌ప‌ల్లి రైతుల‌కు రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ ప‌నుల‌కు సంబంధించి ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేసిన సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కంసాన్‌ప‌ల్లిలో ప్ర‌భుత్వానికి సంబంధించిన స్థ‌లం వెయ్యి ఎక‌రాలు ఉంద‌ని ఎమ్మెల్యే త‌న దృష్టికి తీసుకొచ్చార‌ని కేటీఆర్ తెలిపారు. అయితే ఇందులో 200 ఎక‌రాల్లో పేద రైతులు సాగు చేసుకుంటున్నార‌ని, వారికి భూ యాజ‌మాన్య హ‌క్కు క‌ల్పించాల‌ని ఎమ్మెల్యే కోరారు. మిగ‌తా 800 ఎక‌రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి మేర‌కు 200 ఎక‌రాలు సాగు చేసుకుంటున్న రైతుల‌కు త‌ప్ప‌కుండా యాజ‌మాన్య హ‌క్కులు క‌ల్పిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వ‌ర‌గా స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ఆ రైతులంద‌రికీ రైతుబంధు ఇస్తామ‌న్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కూడా ఏర్పాటు చేసి నారాయ‌ణ‌పేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నారాయ‌ణ‌పేట ప‌ట్ట‌ణానికి ఆధునీక‌మైన మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించి, అంద‌జేస్తామ‌న్నారు. ఒక మానవ వ్య‌ర్థాల శుద్దీక‌ర‌ణ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. గిరిజ‌న సోద‌రుల కోసం సేవాలాల్ భ‌వ‌న్‌ను కూడా మంజూరు చేయిస్తాన‌ని కేటీఆర్ హామీ ఇచ్చారు.

అంతకుముందు శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో గ్రూప్ – 1, గ్రూప్ – 2, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల శిక్షణ కు అవసరమైన స్టడీ మెటీరియల్ నిరుద్యోగ యువతి, యువకులకు ఉచితంగా రాష్ట్ర మంత్రులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గార్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో MP మన్నే శ్రీనివాస్ రెడ్డి, MLA లు డా. లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ S. వెంకటరావు, అదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, SP వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్