Friday, March 29, 2024
HomeTrending Newsతెలంగాణ కోసం తెగించి కొట్లాడుతాం : కేటీఆర్

తెలంగాణ కోసం తెగించి కొట్లాడుతాం : కేటీఆర్

కృష్ణా జ‌లాల విష‌యంలో కానీ, ఇంకో విష‌యంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే అని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు రెండు నాలుక‌ల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నం కోసం ఎంత‌కైనా తెగించి కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

మంత్రి మ‌ల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ కార్పొరేష‌న్‌లోని న‌లుగురు కాంగ్రెస్ కార్పొరేట‌ర్లు, ఘ‌ట్‌కేస‌ర్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు చేరారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి కేటీఆర్ సాద‌రంగా ఆహ్వానించారు. అనంత‌రం తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.

మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనే 10 మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు ఉన్నాయి. మీ అంద‌రి మ‌ద్ద‌తుతో ప‌దింటికి ప‌దిని మంత్రి మ‌ల్లారెడ్డి గెలిపించుకున్నారు. ప్ర‌జ‌ల్లో పార్టీపై విశ్వాసం ఉండ‌డం వ‌ల్లే గెలుపు సాధ్య‌మైతుంద‌న్నారు. అత్యంత ఎక్కువ స‌మ‌స్య‌లు ఉన్న ప్రాంతం జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్. ఈ కార్పొరేష‌న్ అభివృద్ధికి త‌ప్ప‌కుండా నిధులు మంజూరు చేస్తామ‌న్నారు. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్ర‌జ‌ల‌కు దుర్గంధం లేకుండా చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. జీవో నం. 58, 59 ప్ర‌కారం ఇండ్ల ప‌ట్టాలు ఇచ్చిన‌ట్లే.. ఇవ్వాల‌ని జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్ర‌జ‌లు కోరారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో ఉంది కాబ‌ట్టి ఆ ప్ర‌కారం ఇండ్ల ప‌ట్టాలు ఇవ్వ‌లేక‌పోయాం. ఈ స‌మ‌స్య‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారిస్తామ‌ని చెప్పారు. న‌గ‌ర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని మంత్రులు మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డికి సూచించామ‌ని తెలిపారు.

కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ర్టాన్ని సాధించుకోవ‌డమే కాదు.. అభివృద్ధి బాట‌లో ప‌య‌నింప‌జేస్తున్నామ‌ని చెప్పారు. అన్ని వ‌ర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నాం. క‌రోనాను కూడా లెక్క చేయ‌కుండా అభివృద్ధి ఫ‌లాలు సామాన్యుల‌కు అందించామ‌న్నారు. ప్ర‌తి పేద వ్య‌క్తికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రెన్ని కుప్పిగంతులు వేసినా.. కొన్ని ప‌ద‌వులు రాగానే కోతికి కొబ్బ‌రిచిప్ప దొరికిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అలాంటి వారిని మ‌నం ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణ ప్ర‌జ‌ల‌పై పూర్తి విశ్వాసం ఉంద‌న్నారు. ఏ ఎన్నిక అయినా.. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వ‌మే తెలంగాణ‌కు శ్రీరామ‌ర‌క్ష అని భావించి.. ఇత‌ర పార్టీల నేత‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్