Saturday, July 27, 2024
HomeTrending Newsఆవేశంతో నిర్ణయాలు వద్దు: మంత్రి నాని

ఆవేశంతో నిర్ణయాలు వద్దు: మంత్రి నాని

ఉద్యోగులు భావోద్వేగంతో, ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలని, ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్ళవద్దని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి చేశారు. కరోనాతో రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని, ఉద్యోగులు పరిస్థితిని అర్ధం చేసుకోవాలని మంత్రి కోరారు. ఉద్యోగుల గురించి ఆలోచించిన ఏకైక సిఎం జగన్ మోహన్ రెడ్డి అని, అందుకే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు.

ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారని నాని వ్యాఖ్యానించారు. గతంలో ఏ ప్రభుత్వమూ 27 శాతం మధ్యంతర భ్రుతి ఇవ్వలేదని,  సిఎం జగన్ ఐ ఆర్ ద్వారా 17,918 కోట్ల రూపాయలు చెల్లించి ఉగ్యోగులకు బాసటగా నిలిచారని, ఉద్యోగులపై ప్రేమ లేకుండానే ఇలా చేశారా అని నాని ప్రశ్నించారు.  హెచ్ ఆర్ ఏ అనేది జీత భత్యాల్లో భాగమని, ఐఆర్ ను జీతంగా ఎలా పరిగణిస్తారని అడిగారు. మొత్తంగా జీతం పెరిగిందా లేదా అనేది చూడాలి కానీ, పీఆర్సీపై దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఉద్యోగులు ఆశించినంత మేరకు పీఆర్సీ ఇవ్వలేనందుకు బాధగానే ఉందని, మరో గత్యంతరం లేకనే ఇలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. కొత్త పీఆర్సీ తో జీతాల్లో కొత్త పడుతుందనే మాట వాస్తవం కాదని స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాల ఆందోళనలను క్యాష్ చేసుకోవాలని కొంతమంది నేతలు గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారని మంత్రి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల గురించి ఆలోచించని నేతలు, ఇప్పుడు నక్క వినయాలు ప్రదర్శిస్తూ.. పెద్ద పెద్ద లాల్చీలు వేసుకున్న నేతలు ఉద్యోగుల చుటూ తిరుగుతున్నారని, ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు.

Also Read : ఉద్యోగులు ఆలోచించాలి: సిఎస్ సూచన

RELATED ARTICLES

Most Popular

న్యూస్