Friday, March 29, 2024
HomeTrending Newsకొన్ని రాష్ట్రాల‌కే ఈ బ‌డ్జెట్ : ఎమ్మెల్సీ క‌విత‌

కొన్ని రాష్ట్రాల‌కే ఈ బ‌డ్జెట్ : ఎమ్మెల్సీ క‌విత‌

ఆర్ధిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ ఇవాళ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ కొన్ని రాష్ట్రాల‌కు చెందిన బడ్జెట్‌లా ఉంద‌ని ఎమ్మెల్సీ క‌విత హైద‌రాబాద్‌ లో ఈ రోజు విమ‌ర్శించారు. మోదీ ప్ర‌భుత్వం విఫ‌లం అయ్యింద‌న‌డానికి ఈ బ‌డ్జెటే ఊదాహ‌ర‌ణ అని ఆమె అన్నారు. 10 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు క‌ల్పిస్తార‌ని ఆశించామ‌ని, తెలంగాణ‌లో ఉద్యోగులకు మంచి జీతాలు ఇస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం మంత్రి ప్ర‌క‌టించిన రిబేట్ ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని ఎమ్మెల్సీ క‌విత తెలిపారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని చెప్పారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని కేవలం మంజూరైన మెడికల్ కాలేజీ వద్దనే ఏర్పాటు చేస్తారని, ఈ క్రమంలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయనప్పుడు ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా తెలంగాణకు రాదని స్పష్టం చేశారు. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పన్ను మినహాయింపును పొడిగించినప్పుడు మరి తెలంగాణ నిమ్జ్, ఇతర సెజ్ ల పరిస్థితి ఏమిటని నిలదీశారు. కొన్ని రాష్ట్రాల వైపే ఎందుకు చూస్తున్నారని అడిగారు.

ఇది జాతీయ బడ్జెటా లేదా కొన్ని రాష్ట్రాల బడ్జెట్ మాత్రమేనా అని నిలదీశారు. కర్నాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5300 కోట్లు కేటాయించినందుకు సంతోషమే కానీ తెలంగాణకు చెందిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు కేటాయింపులేవని ప్రశ్నించారు. నీతీ ఆయోగ్ సిఫారసు చేసిననప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్ లో భవిష్యత్తుపై నిర్ధిష్టమైన ప్రణాళిక ఏమీ లేదని విమర్శించారు. కొత్త పథకాలు ప్రకటించకపోవడం, పాత పథకాలను విస్మరించడం వంటివి చూస్తుంటే ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోందని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధిని నిర్ధేశించని బడ్జెట్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. బడ్జెట్ ను మోదీ అంకెల గారడిగా అభివర్ణించారు.కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఒక లక్ష కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.

ఎయిర్పోర్టుల వంటి ప్రాజెక్టుకు ప్రకటించినా అవన్నీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీజేపీ పాలిత రాష్ట్రాలకే మంజూరు చేస్తారని తెలిపారు. నిజామాబాద్, వరంగల్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉందని, గత 9 ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. ఏయే రాష్ట్రాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తరో జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలకు రూ. 10 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించిన కేంద్రం… వాటిని ఏ సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. కేవలం వారి కార్పొరేట్ మిత్రులకే వెళ్తాయా ఈ నిధులు అని అడిగారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రాలు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు మాత్రం ల‌బ్ధి చేకూరేలా కేంద్రం డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించింద‌ని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. మౌళిక‌స‌దుపాయాల క‌ల్ప‌న కోసం ప‌దివేల కోట్లు కేటాయిస్తున్నార‌ని చెప్పార‌ని, కానీ ఎటువంటి మౌళిక‌సదుపాయాలో ఆ బ‌డ్జెట్‌లో వెల్ల‌డించ‌లేద‌ని ఆమె విమ‌ర్శించారు. సుమారు వెయ్యి కోట్ల వ‌ర‌కు కేంద్రం తెలంగాణకు రుణ‌ప‌డి ఉంద‌ని, ఆ బాకీలు చెల్లించాల‌ని ఆర్ధిక‌మంత్రిని కోరుతున్న‌ట్లు క‌విత తెలిపారు.

Also Read :

బడ్జెట్ 2023…మహిళల కోసం కొత్త స్కీమ్‌

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్