పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనే మొత్తం అయిపోయిందన్న డీలా పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు మొత్తం ప్రజాభిప్రాయానికి నిదర్శనం కాదని స్పష్టం చేశారు. ఈ గెలుపుతో సంబరాలు చేసుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తామని టిడిపిని ఉద్దేశించి అన్నారు. నాలుగేళ్ళుగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ ఓటర్లలో లేరని… ఈ ఎన్నికతో ఏదో మారిపోయిందని అనుకోవద్దని, అలాగని వారి గెలుపును ఈజీగా తీసుకోబోమని చెప్పారు.
తెలుగుదేశం-పిడిఎఫ్ మధ్య ఓ అవగాహన కుదిరిందని, ప్రాధాన్యతా ఓట్లు ఒకరినొకరు బదలాయింపు చేసుకున్నారని సజ్జల విశ్లేషించారు. తాము ఇంతవరకూ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందలేదని, తొలిసారి రెండు సీట్లు గెలిచామని, వారి ఆశీర్వాదం లభించిందని అన్నారు. మొత్తం 14 స్థానాల్లో 11 సీట్లు తాము గెల్చుకున్నమన్నారు.
ఉపాధ్యాయులు-గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో సాధారణంగా వస్తే మాది, పొతే వారిది అన్నట్లుగా ఉంటుందని, తాము తొలిసారి ఈ సెగ్మెంట్ లోకి ప్రవేశించామని, మూడు గ్రాడ్యుయేట్స్ సీట్లు ఓటమి పాలైనా, రెండు టీచర్స్ స్థానాల్లో విజయం సాధించగలిగామని వివరించారు.