Friday, June 12, 2026
HomeTrending Newsమోడీ ఫోటో పెట్టాలి: కేంద్ర మంత్రి భారతి

మోడీ ఫోటో పెట్టాలి: కేంద్ర మంత్రి భారతి

PM Photo: వైద్య ఆరోగ్య రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, భారీగా నిధులు కేటాయిస్తున్నామని  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం పేదల అభ్యున్నతికోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చిందన్నారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భీమా పథకమని అభివర్ణించారు. ఈ పథకం ద్వారా ఏపీలో 50 లక్షల మంది లబ్ధిపొందారన్నారు.

మంగళగిరి లోని ఎయిమ్స్ నిర్మాణానికి 1618 కోట్లు కేటాయించామని, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమానికి 1042 కోట్లు ఇచ్చామని వివరించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మాణానికి కూడా నిధులు ఇస్తున్నామన్నారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రాలు సరిగా అమలుచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా అవి ప్రజలకు చేరడం లేదని, ఏపీలో కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న పథకాలకు మోడీ ఫోటో కూడా లేకపోవడం సరికాదన్నారు. కేంద్ర అందిస్తోన్న నిధులను దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుందని, కేంద్ర నిధులతో నడిచే పథకాలకు తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫోటో ముద్రించాలని కేంద్ర మంత్రి భారతి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular