“ఒరులేయవి యొనరించిన నరవర! యప్రియము తన మనంబునకగు దా
నొరులకునవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్” –
తిక్కన, ఆంధ్ర మహాభారతం, శాంతి పర్వం, పంచమాశ్వాసం- 220వ పద్యం
(ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు.
అదే ధర్మం. )
“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషుకదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తేసంగోஉస్త్వకర్మణి|| ”
(“నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆకర్మఫలానికి అధికారివి కాదు ; ప్రతిఫలాపేక్షతోకర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడంమానకు”)
కలికాలంలో పరిస్థితులను ఊహించి చెప్పారేమో పైన ఉదహరించినవి అనిపించక మానదు. ఎందుకంటే గమనిస్తే కలికాలంలో కొన్ని చుట్టూ చూస్తూ ఉంటాం. మంచివారికి సహాయం చెయ్యడానికి ఎవరూ ముందుకు రాకపోవడం. చెడ్డవారి కోసం పనిచేయడానికి బారులు తీరి ఉండటం. అలాగే సమాజం కులాలవారీగా, మతాలవారీగా చీలిపోవడం, పక్కవాడిని దోచుకు తినడం. ప్రభుత్వాలు పేరుకే గానీ పాలన గాలికొదిలేసి కక్షా రాజకీయాలు చేయడం. ముఖ్యంగా మంచివారిని వేధించడం. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన ప్రసారసాధనాలు, రక్షణ వ్యవస్థలు అధికారానికి కొమ్ము కాయడం. అంతా చదువుకున్నవారే అయినా అది తమ వర్గానికే మేలు చేయాలి అనుకోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బతకడం ఎలా అంటే పెద్దలు సూచించిన కొన్ని పద్ధతులు
- ఒకరి పట్ల ఎంత నమ్మకమున్నా, అన్నీ చెప్పకూడదు. కొన్ని మనసులోనే ఉంచుకోండి
- ఏదన్నా నిర్మాణాత్మకమైన పని చేయాలనుకున్నప్పుడు విమర్శలు, కుట్రలు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి
- జీవితంలో ఎప్పుడైనా సరే, ఉద్యోగం, వృత్తి కన్నా మానసిక ఆరోగ్యం ముఖ్యమని గ్రహించాలి.
- ఒక్కరుగానే మీరు అనుకున్నది సాధించగలరని గ్రహించినపుడు మీరొక ఎదురులేని శక్తిగా మారతారని తెలుసుకోండి
- మీరంటే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. సర్థుకుపోండి. చాలా మంది తమను తాము ద్వేషించుకుంటూ, ఇతరులనూ అకారణంగా తిట్టుకుంటూ ఉంటారు
- అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. పరిస్థితులతో రాజీకి సిద్ధంగా ఉండాలి
- జీవితంలో ఏం జరిగినా సరే, సంతోషంగా ఉండడాన్ని ఎంచుకోవాలి. విచారాన్ని మోయడం ఎప్పుడూ ఛాయిస్ కాకూడదు
- మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం అనవసరం

