Saturday, September 21, 2024
HomeTrending Newsనాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ప్రారంభం

నాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ప్రారంభం

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రెండు రాష్ట్రాల్లో 60 చొప్పున స్థానాలున్నప్పటికీ 59 సీట్లకే ఎన్నికలు జరుగుతున్నాయి. మేఘాలయలో సోహియాంగ్‌లో నియోజకవర్గ యూడీపీ అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్‌ వాయిదాపడింది. ఇక నాగాలాండ్‌లోని అకులుటో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 34 లక్షలమంది ఓటర్లు ఉన్నారు.

మేఘాలయాలో ఎన్నికలు జరుగుతున్న 59 స్థానాల్లో 369 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 21 లక్షల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం అధికారులు 3419 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా అధికార ఎన్‌పీపీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్యే ఇక్కడ పోటీ నెలకొన్నది. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీకి భారతీయ జనతాపార్టీ నుంచి గట్టి పోటి నెలకొంది. గతంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ పాలన సాగించింది. మేఘాలయలో మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కన్నేసింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కూడా పోటీ పడుతోంది. 640 పోలింగ్ కేంద్రాల్లో 323 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మేఘాలయలో పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా సాగుతుందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎఫ్ఆర్ ఖర్ కోంగర్ చెప్పారు.

 

ఇక నాగాలాండ్‌లో మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 13 లక్షల మంది ఓట్లు వేయనున్నారు. ఇక్కడ అధికార ఎన్‌డీపీపీ, బీజేపీ పొత్తుపెట్టుకోగా, కాంగ్రెస్‌, ఎన్సీపీ, జేడీయూ, ఎన్‌పీపీలు వాటికి పోటీనిస్తున్నాయి. అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి) బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ 23, 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 2018వ సంవత్సరంలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. పోలింగ్ కోసం 2,291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య పోలింగ్ సాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్