Saturday, July 27, 2024
HomeTrending Newsడిసెంబర్ 23నుంచి నంది నాటకోత్సవాలు: పోసాని

డిసెంబర్ 23నుంచి నంది నాటకోత్సవాలు: పోసాని

నాటకరంగ విస్తరణకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించడంలో భాగంగా ఈ ఏడాది నంది నాటకోత్సవాలు డిసెంబర్ 23 నుంచి 29 వరకూ గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్ పోసాని కృష్ణ మురళి వెల్లడించారు. ఎన్ఠీఆర్ రంగస్థల పురస్కారం మరియు , డా. వై.ఎస్.ఆర్ రంగస్థల పురస్కారం. ఎంట్రీలకు  గడువును ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. నేడు విజయవాడలో సంస్థ కార్యాలయంలో దీనికి సంబంధించిన వివరాలు. నంది అవార్డుల తుది పోటీల న్యాయనిర్ణేతల సమక్షంలో వెల్లడించారు. అనంతరం ఎండి తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎం. శేషసాయిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రం నలుమూలల నుండి మొత్తం ఐదు విభాగాలలో 38 నాటక సమాజాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని, ఉత్సవాలు తిలకించేందుకు అందరూ ఆహ్వానితులేనని పోసాని స్పష్తం చేశారు.

కాగా, ఎంట్రీల ప్రాధమిక ఎంపిక ఈ ఏడాది సెప్టెంబర్ 6-18 మధ్య జరగగా, ఫలితాలను సంస్థ 19న వెల్లడించింది. ఇందుకోసం మూడు న్యాయనిర్ణేతల బృందాలు పోటీల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చిన నాటక సమాజాల వద్దకు వెళ్లి వీటిని ఎంపిక చేసింది. వీటిలో పద్యనాటకాలలో 26 నుంచి 10, సాంఘిక నాటకాలలో 22 నుంచి 6, సాంఘిక నాటికలలో 49 నుంచి 12, కాలేజీ – యూనివర్సిటీ స్థాయిలో 9 నుంచి 5, బాలల విభాగాలలో 9 నుంచి 5 ఎంపిక చేయడం జరిగింది.

వారం రోజుల పోటీల్లో తుది ఎంపిక కోసం సంబంధిత సమాజాలు సంస్థ చైర్మన్ సమక్షంలో జరిగిన ‘లాటరీ’లో పాల్గొన్న అనంతరం ప్రదర్శనల ‘షెడ్యూలు’ను సంస్థ ఖరారు చేసింది. దాని ప్రకారం ప్రతి రోజు ఉదయం 9.30 నుండి రాత్రి 10 గంటల వరకు నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఐదు విభాగాలలో స్వర్ణ, రజిత, కాంస్య నంది బహుమతులకై జరుగనున్న పోటీలలో ఒక్కొక్క దానిలో ముగ్గురు చొప్పున మొత్తం 15 మంది న్యాయనిర్ణేతలు ఈ తుది ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేస్తారు. అవార్డులు ప్రదానం చేస్తున్న ఏడాదిలో (2022) నాటక రంగంపై వెలువడిన ఉత్తమ రచన గ్రంధం ఎంపిక కోసం మరో ముగ్గురుతో మరో కమిటీ ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం 1998 నుంచి నంది నాటకోత్సవాల వేదికపై- ఎన్టీఆర్ రంగస్థల పురస్కారంనాటకరంగంలో వ్యక్తిగత స్థాయిలో విశేష కృషి చేసిన నటులకు, కళాకారులకు- రూ.1,50,00 నగదు ప్రదానం చేస్తున్నది. కాగా ఇప్పుడు మొదటిసారి ఈ రంగంలో సమిష్టి కృషితో (టీమ్ వర్క్) పనిచేసిన సమాజాలకు, పరిషత్తులకు ఈ అవార్డుతో గుర్తింపు లభించనుంది. నాటక రంగంపై ఆసక్తిగల కళాప్రియులకు వేదిక కల్పించి, ఆ రంగం వృద్ధికి గణనీయమైన కృషి చేసిన సమాజాలు, పరిషత్తులకు రూ. 5,00,000 నగదు, ‘వైఎస్సాఆర్’ ప్రతిమ మొమెంటోతో సత్కరిస్తూ అరుదైన గౌరవం నాటక సమాజాలకు ప్రభుత్వం కల్పించబోతున్నది.

ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ రంగంలో నిపుణులు మొత్తం 27 మంది న్యాయ నిర్ణేతలుగా ఈ ఏడాది నంది నాటకాల ప్రాథమిక, తుది ఎంపిక కోసం పనిచేస్తున్నారు. వారికే ఈ రెండు అవార్డులు కోసం వచ్చిన ఎంట్రీలు నుంచి అర్హులను ఎంపికచేసి బాధ్యతను అప్పగించడం జరిగింది. కాగా ‘ఎన్ఠీఆర్’, ‘డా. వై.ఎస్.ఆర్’. అవార్డుల ఎంట్రీలకు తుది గడువు డిసెంబర్ 20వరకు పొడిగించడం జరిగింది. దరఖాస్తులు మెయిల్ ద్వారా పంపడానికి మరియు మా సంస్థకు  దరఖాస్తులు పంపుటకు చివరి తేది:20.12.2023 గా పోడిగించడమైంది.

బాలల, కళాశాల విద్యార్థిల నాటకల విభాగాల్లో వ్యక్తిగత బహుమతులను వచ్చే సంవత్సరం నుండీ బహుమతులను ఇచ్చె విధంగా  సంస్థ చూస్తుంది.

గుంటూరు కలెక్టర్ ఆధ్వరంలో ఇందుకోసం ఇప్పటికే స్థానికంగా తగు ఏర్పాట్లు చూడడానికి సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇస్తున్నారు. స్థానిక కళాకారులతో మరియు అధికారులతో నిర్వహణ కమిటీ, ఆహ్వాన కమిటీ, స్టేజీ కమిటీ, ఆడిటోరియం కమిటీ, ఆతిథ్య కమిటీ, వసతి సదుపాయాలు మరియు రవాణా కమిటీ ప్రెస్ సమన్వయ కమిటీ మరియు తదితర కమిటీలను ఏర్పాటు చేసి, ఈ రోజు వారితో శ్రీ పోసాని క్రిష్ణ మురళి గారి ఆధ్వరంలో సమావేశం జరిగింది నంది అవార్డులు జరుగుటకు అందరు సహకరించగలరు అని కోరడం జరిగింది.

సంస్థ మేనేజింగ్ డైరక్టర్ టి. విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆదరణ తగ్గుతున్న ఈ రంగానికి ప్రభుత్వం నుంచి కొత్తగా లభిస్తున్న ఇటువంటి ప్రోత్సాహంవల్ల, మళ్ళీ దీనికి పూర్వ వైభవం లభించాలనే కళాభిలాషుల ఆకాంక్ష నెరవేరనుంది. ఇటువంటి ప్రభుత్వం చొరవ వల్ల నాటక రంగంలోకి కొత్తగా యువతరం ప్రవేశించే అవకాశం ఎంతైనా ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్