Thursday, March 12, 2026
HomeTrending NewsCBN : కోర్టు ఖర్చులు వందల కోట్లు.. నిజమేనా?

CBN : కోర్టు ఖర్చులు వందల కోట్లు.. నిజమేనా?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేసుల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 371 కోట్లు కాగా ఇప్పటి వరకు చంద్రబాబు న్యాయవాదులకు 500 కోట్లు ఖర్చు అయ్యాయని అంటున్నారు. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక. బాబు తరపు న్యాయవాదుల్లో అందరు ఉద్దండులే కావటంతో తెలుగుదేశం పార్టీకి ఖర్చు తడిసి మోపెడు అవుతోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

న్యాయవాదులు ఢిల్లీ నుంచి విజయవాడ రాకపోకలకు ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. ఢిల్లీలో న్యాయవాదులను సమన్వయము చేసేందుకు నేతలు, పార్టీ సానుబూతిపరులను పెద్ద సంఖ్యలో మొహరించారు. ఇందుకోసం జరుగుతున్న ఖర్చు కోట్లలోనే ఉంటుందనటంలో అనుమానం లేదు.

న్యాయవాది హరీష్ సాల్వే ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఆయన నివాసం ఢిల్లీ అయినా కొత్తగా వివాహం కావటంతో…సాల్వే లండన్ నుంచి వచ్చి పోవటానికి చార్టెడ్ విమానానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. సుప్రీంకోర్టులో బాబు పిటిషన్ పై వాదనలు ముగిశాక తిరిగి సాయంత్రం లండన్ వెళ్తారు.

చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్దార్థ లూథ్ర, ప్రమోద్ కుమార్ దూబే ఏసిబి కోర్టులో వాదిస్తున్నారు. హైకోర్టులో సిద్దార్థ లూథ్ర, దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టులో సిద్దార్థ లూథ్ర, హరీష్ సాల్వే, సిధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తుండగా తాజాగా అభిషేక్ మను సింఘ్వి జత కలిశారు.

సర్వోన్నత న్యాయస్థానంలో బాబు పిటిషన్ పై వాదనల సమయంలో న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒకరి తర్వాత ఒకరు నలుగురు మహా ఘటికులు వాదనలు వినిపించటంతో… అసలు పిటిషనర్ తరపున ఎంతమంది న్యాయవాదులు అని జడ్జి ప్రశ్నించారు. తాము నలుగురం వాదిస్తున్నామని… అయినా ప్రభుత్వం తరపున వాదిస్తున్న ముకుల్ రోహ్తగి మా నలుగురితో సమానమని జవాబు ఇవ్వటంతో కొద్దిసేపు నవ్వులు విరిశాయి.

మొదటి రోజు నుంచి ప్రముఖ న్యాయవాది సిద్దార్థ లూథ్ర చంద్రబాబు బెయిల్ కోసం శతధా ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్ర ఫీజు కూడా అధికమే. ఆయన ఫీజు రోజుకు కోట్లలో ఉంటుందని అంటున్నారు. విజయవాడ ఏసిబి కోర్టులో లూథ్ర ఆయనతో పాటు ప్రమోద్ కుమార్ దూబే ఉన్నారు.

బాబు కేసులో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. చారానా కోడికి భారానా మసాలా అన్నట్టుగా… కుంభకోణం ఆరోపణల కన్నా ఖర్చులు పెరగటంతో లోకేష్ కు పాలుపోవటం లేదు. ఇంత జరిగితే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంకా ఎంత ఖర్చు అవుతుందో అని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు.

-దేశవేని భాస్కర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular