Sunday, May 19, 2024
HomeTrending Newsతాటాకు చప్పుళ్ళకు బెదరను : సిఎం జగన్

తాటాకు చప్పుళ్ళకు బెదరను : సిఎం జగన్

తనపై ఓ రాయి విసిరినంత మాత్రాన  జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందార్ల ఓటమిని… మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ అపపలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  ఇలాంటి దాడుల వల్ల తన సంకల్పం చెక్కు చెదరబోదని, ఈ స్థాయికి వారు దిగజారారంటే విజయానికి మనం చేరువగా ఉన్నామని, వారు చాలా దూరంగా ఉన్నారని అర్ధం అంటూ వ్యాఖ్యానించారు. “ఈ  తాటాకు చప్పుళ్ళకు మీ బిడ్డ బెదరడు, ఆదరడు” అని స్పష్టం చేశారు. గుడివాడ శివార్లలోని నాగవరప్పాడులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తూ మొన్న విజయవడలో జరిగిన దాడి ఘటనపై స్పందించారు.

ఇలాంటి ఘటనల వాళ్ళ మీకు సేవ చేయాలన్న తన సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప తగ్గబోదని, వెనకడుగువేసే ప్రసక్తే లేదన్నారు.  తన నుదిటిపై వారు చేసిన గాయం… దేవుడి దయతో కణతకు, కంటికి తగలలేదని అంటే ‘మీ బిడ్డ విషయంలో దేవుడి స్క్రిప్టు వేరేగా ఉందని అర్ధం’ అంటూ వ్యాఖ్యానించారు. నా నుదిటిపై వారు చేసిన గాయం పదిరోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదవర్గాలకు బాబు పాలనలో చేసిన గాయాలు, ఆ మోసాలతో అతలాకుతలమైన పేదల బతుకులు ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. గాయపరచడం, మోసం, కుట్రలు చేయడం బాబు నైజమైతే… ఇంటింటికీ మంచి చేయడం మీ బిడ్డ జగన్ నైజమని ప్రజలనుద్దేశించి అన్నారు.

ప్రజలకు సేవకుడిగా ఉన్న తనపై ఇంతమంది కలిసి యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ‘ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ’ అన్నారు. చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఓ బాణాన్ని వేసినంత మాత్రాన కురుక్షేత్ర సంగ్రామాన్ని కౌరవులు గెలిచినట్లు కాదని తేల్చి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్